వెళ్లొస్తాం..
ABN , First Publish Date - 2022-01-18T05:41:11+05:30 IST
సంక్రాంతి పండుగ ప్రభావంతో రవాణా వ్యవస్థకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పండుగకు సొంతూరులో గడిపి ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం తిరిగి నగరాలకు వెళ్లేందుకు ప్రయాణ కష్టాలు తప్పడంలేదు.
ఏలూరు రూరల్, జనవరి 17 : సంక్రాంతి పండుగ ప్రభావంతో రవాణా వ్యవస్థకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పండుగకు సొంతూరులో గడిపి ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం తిరిగి నగరాలకు వెళ్లేందుకు ప్రయాణ కష్టాలు తప్పడంలేదు. పదిహేను రోజుల నుంచి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రైవేటు రవాణా సౌకర్యాలన్నింటిలో రిజర్వేషన్ నిల్ బోర్డులు దర్శనమివ్వగా వారం రోజుల నుంచి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే పలు మార్గాల్లో పయనమయ్యారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి వచ్చిన వారు కావడంతో అటువైపు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోయాయి. రెగ్యులర్తోపాటు ప్రత్యేక బస్సుల్లోనూ టికెట్ బుకింగ్లయ్యాయి. వ్యక్తిగత వాహనాల్లో వచ్చిన వారు రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ ప్రత్యేక బస్సులు నడిపాయి. గత ఏడాది కొవిడ్ తొలిదశ కారణంగా సంక్రాంతికి ఎక్కువమంది బంధువులు స్వస్థలాలకు రాలేకపోయారు. ఈ ఏడాది గత వారమే ఎక్కువ మంది పండుగకు వచ్చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు పండుగ రోజు ముందే వచ్చి మూడు రోజులపాటు పండుగను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఈ మూడు రోజుల్లో సినిమా ప్రదర్శనలపై కొవిడ్ ఆంక్షలు ఉన్నా పండుగకు వచ్చిన చిత్రాలను కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లి చూసి ఆనందించారు. షాపింగ్ చేయడంతో మాల్స్ రద్దీగా మారాయి. ఆదివారం కనుమ పండుగను, సోమవారం ముక్కనుమను జరుపుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుగు ప్రయాణాలు ప్రారంభంకావడంతో కలపర్రు టోల్గేట్ వద్ద రహదారి రద్దీగా మారడం ప్రారంభమైంది. పలు రహదారులు అత్యంత రద్దీగా మారాయి. తెలంగాణలో పాఠశాలలు ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో కొంతమంది వారి తిరుగు ప్రయాణంను విరమించుకున్నారు. ఉద్యోగస్తులు మాత్రం వెళ్లారు. పిల్లాపాపలతో ప్రయాణం చేయాల్సి ఉండడంతో మరోసారి బస్సు ప్రయాణానికి ఇబ్బందులు, తిప్పలు తప్పలేదు.
పల్లె వెలుగుల కోసం పడిగాపులు..
పల్లె నుంచి పట్టణానికి ప్రయాణించేందుకు అధిక శాతం ఆర్టీసీయే ఆధారం కావడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. పండుగకు కొన్ని ప్రాంతాలకే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో అప్పుడప్పుడు వచ్చే పల్లె వెలుగు బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు టికెట్లు దొరక్క తిరిగి వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.