హనుమజ్జయంతి
ABN , First Publish Date - 2022-05-26T06:37:18+05:30 IST
గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల వద్ద బుధవారం హనుమజ్జయంతి వైభవంగా నిర్వహించారు.
ఆంజనేయుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
వీరవాసరం, మే 25: గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల వద్ద బుధవారం హనుమజ్జయంతి వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. నందమూరుగరువు భక్తాంజనేయస్వామి ఆలయంలో లక్ష తమలపాకు పూజలను పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సువర్చల అమ్మవారితో హనుమ కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కల్యాణాన్ని తిలకించారు.
భీమవరం టౌన్: మారుతీ టాకీస్ సెంటర్లోని దాసాంజనేయ స్వామికి 4వేల లీటర్ల ఆవుపాలతో అభిషేకం నిర్వహించారు. సోమేశ్వరస్వామి దేవస్దానం ఉపాలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తమలపాకుల పూజ చేశారు.
పాలకొల్లు అర్బన్ / రూరల్: పట్టణంలోని పలు ఆంజనేయస్వామి ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యడ్ల బజారు పంచముఖాంజ నేయస్వామి ఆలయంలో సహస్ర నామార్చనలు నిర్వహిం చారు. కెనాల్ రో డ్డులోని దాసోహాంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని 20 కిలోల వెన్నతో ప్రత్యేకంగా అలంకరించారు. లంకలకోడేరు అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాడేపల్లిగూడెం రూరల్: మాధవరంలో అభయాంజనేయస్వామి 27 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్ఠ బుధవారం ఘనంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ, హనుమజ్జయంతి కలసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి.