ఆసుపత్రికి సుస్తీ
ABN , First Publish Date - 2022-06-06T05:26:12+05:30 IST
రిఫరల్ ఆసుపత్రిగా పేరు ఉన్న జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు కేసులకు సంబంధించి ఆసుపత్రికి వస్తుంటే ప్రాథమిక చికిత్స చేసి వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తిష్ఠ
పేరుకే వంద పడకల ఆసుపత్రి..
అంతంతమాత్రంగా సేవలు
వేధిస్తున్న మందులు, సిబ్బంది కొరత
రోజూ అధిక సంఖ్యలో గిరిజనుల రాక
పాయిజన్, రోడ్డు ప్రమాదాల కేసులు అధికమే
ప్రాథమిక చికిత్స చేసి ఇతర ఆసుపత్రులకు
రిఫర్ చేస్తున్నారని ఆరోపణలు
జంగారెడ్డిగూడెం, జూన్ 5 : రిఫరల్ ఆసుపత్రిగా పేరు ఉన్న జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు కేసులకు సంబంధించి ఆసుపత్రికి వస్తుంటే ప్రాథమిక చికిత్స చేసి వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇటు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల నుంచి సుమారు 150 గ్రామాల నుంచి ప్రజలు వివిధ సమస్యలతో ఈ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ చికిత్స చేయకుండానే రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర కేసుల్లో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరు, లేదా విజయవాడకు తీసుకువెళ్లే లోపు ప్రాణాలపైకి వస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా సిబ్బంది, మందుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
వెంటాడుతున్న సిబ్బంది కొరత
ఏరియా ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి స్థాయిలో సుమారు 24 మంది నర్సులు ఉండాలి. కానీ ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో రెగ్యులర్ నర్సులు నలుగురు, అవుట్సోర్సింగ్ నర్సులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక ఎంబీఎస్లో ఇద్దరు, సిమాన్స్లో ముగ్గురు కలపి మొత్తం 12 మంది నర్సులు మాత్రమే 24 గంటల పాటు ఆసుపత్రిలో షిప్ట్ల వారీగా ఉంటున్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి ప్రతీరోజు వందల సంఖ్యలో ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. మే నెలకు సంబంధించి 2,603 మంది రోగులు వివిధ వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి వచ్చారు. వీటిలో డెలివరీ కేసులు 111 కేసులు, ట్యుబెక్టమీలు 53, కుక్క కాటు 46 కేసులు, పాయిజన్ తీసుకున్న వారు 40 కేసులు, రోడ్డు ప్రమాదాలు 104 కేసులతో పాటు పాముకాటు ఇతర కేసులు భారీగా నమోదయ్యాయి.
మందులకూ ఇబ్బందే..
ఆసుపత్రికి చికిత్సకు వచ్చే వారంతా పేదవారే. ప్రభుత్వ ఆసుపత్రి అని ఉచితంగానే ఉంటాయని భావిస్తే పొరపాటే. ఇక్కడ వైద్యం పొందేందుకు ఎంతోకొంత చేతిలో పట్టుకుని రావాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏ మందులు రాస్తారో తెలియదు.అవి ఆసుపత్రిలో ఉంటాయో లేక బయట తెచ్చుకోమంటారో అర్థం కాని పరిస్థితి. చాలామంది అర్ధరాత్రులు సైతం పట్టణంలోని ప్రైవేట్ మెడికల్ దుకా ణాలకు పరుగులు తీస్తుంటారు. ముఖ్యంగా ఆపరేషన్ల అనంతరం కొన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. కాట్గాట్ క్రామిక్–1, 2, ఐవీ సెట్స్, యూరినరీ బ్యాగ్స్, యూరినరీ కేతిటర్స్ ఆసుపత్రిలో ఉండడం లేదని బయట తెచ్చుకోమని చెబుతున్నారు. అలాగే గ్యాస్కు సంబందించి టాబ్లెట్లు, ఇంజెక్షన్లు కూడా బయటకు రాస్తున్నారు.
ఎక్స్రేలు 20 మందికే..
ప్రతీ రోజు 40 నుంచి 50 మంది వరకు ఎములకు సంబందించిన ఎక్స్రేల నిమిత్తం ఆసుపత్రికి వస్తున్నారు. కానీ ఆసుపత్రిలో ఉన్న మిషన్కు అంత సీన్ లేదు. 100 ఎంఎ పవర్ గల మిషన్ మాత్రవే అందుబాటులో ఉంది. 20 ఎక్స్రేలు తీస్తే మిషన్ వేడెక్కి ఆగిపోతుంది. ఆ తరువాత వచ్చిన వారంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. కనీసం ఇక్కడ 300 ఫిక్స్డ్ ఎంఎ పవర్ మిషన్ ఉండాలి. ఆసుపత్రిలోని జనరల్ ల్యాబ్లో మాన్యువల్ ల్యాబ్ టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి.మిగలినవన్నీ బయట చేయించుకుని రావాలసిందే.
ప్రారంభం కాని ఐసీయూ సెంటర్
ఎంపీ కోటగిరి ఽశ్రీధర్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా సుమారు రూ.1.50 కోట్లతో 12 బెడ్లతో ఐసీయూ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏసీలతో పాటు అన్ని రకాల ఎక్విప్మెంట్ను సమకూర్చారు. కానీ ఇక్కడ సిబ్బంది కొరతతో ఐసీయూ థియేటర్ను ఓపెన్ చేయడం లేదని చెబుతున్నారు. ఇలా దాతల ఆశయాలు నీరుగారుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 పడకల సామర్థ్యం గల మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణంలో ఉంది. ఇది త్వరలోనే ప్రారంభం అవుతుంది. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ప్రత్యే కంగా ఇక్కడ చికిత్స అందిస్తారు. అసలే సిబ్బంది కొరత వెంటాడుతుంటే ఇది కూడా ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని అంటున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.
పారిశుధ్య ఇబ్బందులు
ఆసుపత్రిలో సరిపడా 21 మంది పారిశుధ్య కార్మి కులు ఉన్నా చెత్తా చెదారాలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చెత్తాచెదారాలు (చికిత్స అనంతరం వాడిపడేసినవి) వేసుకునేందుకు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులు పలుమార్లు మున్సిపల్ అధికా రులను కోరారు. అయితే ఊరంతా డస్ట్బిన్లు పంచి ఆసుపత్రికి మాత్రం కేటాయించలేదు. దీంతో ఆ వ్యర్థాలను ఆసుపత్రిలో ఖాళీ స్థలంలోనే పాడేస్తున్నారు.