నవ దంపతులకు యువకుడి వేధింపులు.. కేసు నమోదు
ABN , First Publish Date - 2022-06-01T06:02:07+05:30 IST
కొత్తగా పెళ్లయిన భార్యభర్తలను ఓ యువకుడు వేధించడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు క్రైం, మే 31 : కొత్తగా పెళ్లయిన భార్యభర్తలను ఓ యువకుడు వేధించడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన ఓ యువతికి నెల రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహమైంది. నల్లమోకల సురేంద్రబాబు అనే యువకుడు కొన్నిరోజులుగా ఆ యువతికి, ఆమె భర్తకు ఫోన్ చేసి నీ భార్య ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం ఇంటికి రమ్మని చెప్పడంతో సురేంద్రబాబు ఇంటికి వచ్చి మళ్లీ బెదిరించాడు. ఈలోపు బంధువులు అక్కడకు చేరుకోవడంతో కారులో పరారయ్యాడు. దీనిపై త్రీటౌన్ పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టామని ఎస్ఐ శంకర్ తెలిపారు.