ప్రమాదకరంగా ఏపూరు బ్రిడ్జి

ABN , First Publish Date - 2022-03-05T05:49:29+05:30 IST

వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఏపూరు బ్రిడ్జి మీదుగా ప్రయాణమంటేనే ఆ ప్రాంత వాసులతో పాటుగా వాహనదారులు భయపడిపోతున్నారు.

ప్రమాదకరంగా ఏపూరు బ్రిడ్జి
ఏపూరు బ్రిడ్జి

గోతులు పడి పైకి లేచిన ఇనుప ఊచలు 

డివైడర్ల పక్కన పేరుకుపోయిన ఇసుక, మట్టి

మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల డిమాండ్‌


పెదపాడు, మార్చి 4 : వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఏపూరు బ్రిడ్జి మీదుగా ప్రయాణమంటేనే ఆ ప్రాంత వాసులతో పాటుగా వాహనదారులు భయపడిపోతున్నారు. ఏపూరు వద్ద విసన్నపేట–పెడన    రాష్ట్ర రహదారిపై వున్న రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి గోతులు పడి రాకపోకలు  సాగించేవారికి ప్రమాదకరంగా తయారైంది. 1996లో రూ.14 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో లోపమో లేక వాహనాల రద్దీవల్లో బ్రిడ్జి నిత్యం మరమ్మతులకు గురవుతోంది. బ్రిడ్జిపై పెద్దస్థాయిలో గోతులు పడడంతో గతంలో సుమారు రూ.50 లక్షలతో మరమ్మతులు చేపట్టారు ఆ తరువాత బ్రిడ్జికి సాధారణ మరమ్మతులు కూడా చేపట్టడం లేదని స్థానికంగా విమర్శలు చేస్తున్నారు. బ్రిడ్జిపై ఏర్పడిన గోతులలో ఇనుపచువ్వలు పైకిలేచి ప్రమాదకరంగా ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు. కొంతకాలంగా బ్రిడ్జిపై డివైడర్ల పక్కన పేరుకుపోయిన మట్టి, ఇసుక, పిచ్చిమొక్కలను తొలగించక పోవడంతో అవి పెద్దఎత్తున పేరుకుపోయాయి. డివైడర్ల పక్క పేరుకుపోయిన ఇసుక, మట్టి రోడ్డుపైకి చేరుతుండడంతో వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అధికారులు రైల్వేప్లైఓవర్‌ బ్రిడ్జిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. 



Updated Date - 2022-03-05T05:49:29+05:30 IST