1 నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
ABN , First Publish Date - 2022-06-27T06:15:31+05:30 IST
1 నుంచి జగన్నాథస్వామి రథోత్సవాలు
లక్ష్మీపురం ఆలయంలో దశావతారాల్లో దర్శనమివ్వనున్న స్వామి
ద్వారకాతిరుమల, జూన్ 26: పురాతన లక్ష్మీపురం జగన్నాథస్వామి ఆలయంలో జూలై 1 నుంచి 10 వరకు రథోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. పూరీ క్షేత్రంలో వలె ఏటా ఉత్సవాలను శ్రీవారి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. పూరీ క్షేత్రం నుంచి తెచ్చిన సుభద్ర, బలభద్ర, జగన్నాథుల దారు విగ్రహాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్థాయి. ఉత్స వాలను పురస్కరించుకుని ఆలయాన్ని, పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరీకరించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 1న రథవాహనంపై స్వామివారు లక్ష్మీపురం ఆలయం నుంచి సాయంత్రం 5గంటలకు శ్రీవారి క్షేత్రానికి ఊరేగింపుగా వస్తారు. ఉత్సవాల ముగింపు రోజైన 10న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురానికి సాయంత్రం 5గంటలకు రథయాత్రగా వెళ్లనున్నారు.
స్వామి అవతారాలు..
రథోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో జగన్నాథస్వామి 1న మత్స్యావతారం, 2న కూర్మ, 3న వరాహ, 4న నృశింహ, 5న వామన, 6న పరశురామ, 7న రామ, 8న కృష్ణా, 9న కల్కి, 10న వేంకటేశ్వరస్వామి అవతారంలో దర్శనమిస్తారు. ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు విశేషసంఖ్యలో తరలిరావాలని ఈవో కోరారు.