మీడియా స్వేచ్ఛను కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2022-12-12T00:08:38+05:30 IST
ప్రజాస్వామ్య మనుగడకు మీడి యా స్వేచ్ఛను కాపాడుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 11 : ప్రజాస్వామ్య మనుగడకు మీడి యా స్వేచ్ఛను కాపాడుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల కన్ను మూసిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ పాత్రికేయుడు వానపల్లి సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ‘మీడియా స్వేచ్ఛ పాలకులకు నచ్చడం లేదు. మీడియాపై అణచివేత ధోరణితో, అసహ నంతో ప్రవర్తిస్తున్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం రద్దు చేసి విలేకరులకు గల హక్కులను, సంక్షేమ పథకాలను తీసేశార’ని అన్నారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు డి.సోమసుందర్ మాట్లాడుతూ సుబ్బారావు చివరి క్షణం వరకు వృత్తిపై మమకారంతో పనిచేశారని, జర్నలిస్టుల సమస్యలపై నిబద్ధతతో నిలబడ్డారన్నారు. శనివారం కన్నుమూసిన పాత్రికేయులు ఎస్కే శ్రీనివాసరెడ్డి, రావూరి చెన్నకేశవకు సంతాపం తెలుపుతూ రెండు నిముషాలు మౌనం పాటించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీరామ్మూర్తి, జిల్లా అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు, కన్వీనర్ గజపతి వరప్రసాద్, ప్రెస్క్లబ్ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.