దేవుడి నగలు మాయం

ABN , First Publish Date - 2022-02-16T06:20:07+05:30 IST

అప్పనవీడు అభయాంజనేయ స్వామికి చెందిన రెండు బంగారు నామాలు, ఒక హారం మాయమైన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, దోషులను శిక్షించాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

దేవుడి నగలు మాయం
అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు

దోషులను శిక్షించాలంటూ మాజీ మంత్రి దేవినేని డిమాండ్‌

పెదపాడు, ఫిబ్రవరి 15 : అప్పనవీడు అభయాంజనేయ స్వామికి చెందిన రెండు బంగారు నామాలు, ఒక హారం మాయమైన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, దోషులను శిక్షించాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరులు అభయాంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. నగలు మాయంపై సంబంధిత వ్యక్తులు ఆర్‌జేసీ సమక్షంలో ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై వచ్చినన్ని ఆరోపణలు 40 ఏళ్ల దేవదాయ శాఖ చరిత్రలో ఎప్పుడూ రాలేదన్నారు. అంతర్వేది రథం తగలబడితే చెక్క బొమ్మలే కదా మళ్లీ చేసుకోవచ్చునని మాట్లాడారన్నారు. నగలు మాయమైన ఘటనలో ప్రభుత్వం తక్షణం స్పందించి దోషులను శిక్షించాలని, అంత వరకూ పోరాటం ఆగదని  తెలిపారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకటగోపాలకృష్ణ, దొంతు మూల్పూరు సాయికళ్యాణి, వేములపల్లి శ్రీనివాసరావు, వడ్డి వాసవి, వేమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-16T06:20:07+05:30 IST