పాఠ్యపుస్తకాలెక్కడ...?
ABN , First Publish Date - 2022-09-26T05:34:42+05:30 IST
ప్రస్తుత విద్యాసంవత్సరం జూలై ఆరో తేదీన ప్రారంభమై పాఠాలు కొనసాగుతున్నాయి.
ఇండెంట్ పెట్టి, డబ్బులు చెల్లించినా పుస్తకాల్లేవ్
ఫార్మేటివ్ పరీక్షలు సమీపిస్తున్నా కొరత
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల దీనస్థితి
పాఠశాలలు ప్రారంభమై మూడునెలలు కావస్తోంది. పాఠ్యపుస్తకాలను రాష్ట్రప్రభుత్వం సరఫరా చేయదు. పోనీ బహిరంగ మార్కెట్లో కొనుక్కుందామన్నా దొరకవు. ఓ వైపు దసరా సెలవుల అనంతరం ఫార్మేటివ్ పరీక్షలు. పుస్తకాలకు ముందస్తుగానే డబ్బులు చెల్లించినా ఇప్పటికీ పంపిణీ చేయలేని ప్రభుత్వానిదా ఈ వైఫల్యం ? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు అందక విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఏలూరు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 25 : ప్రస్తుత విద్యాసంవత్సరం జూలై ఆరో తేదీన ప్రారంభమై పాఠాలు కొనసాగుతున్నాయి. పాఠ్య పుస్తకాల కోసం అన్ని ప్రైవేటు పాఠశాలల్లో అటు యాజమన్యాలు, ఇటు విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. గతేడాది వినియోగించిన పాత పాఠ్య పుస్తకాలను సేకరించేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన విధానంతో ప్రైవేటు పాఠశాలలు సైతం రాష ్ట్రప్రభుత్వం దగ్గర నుంచే విధిగా కొనుగోలు చేయాలి. ఆ మేరకు ఈ ఏడాది మే నెలలోనే పాఠశాలల్లో తరగతుల వారీగా గత విద్యాసంవత్సరం నాటి చైల్డ్ఇన్ఫో, డైస్ డేటా ఆధారంగా విద్యాశాఖ నేరుగా పాఠ్య పుస్తకాలకు ఇండెంట్ నమోదు చేసుకుంది. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం పుస్తకాలకు ఇండెంట్ను ఇవ్వగా, మరికొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిం చాయి. వాస్తవానికి ప్రభుత్వం ముద్రించే పాఠ్యపుస్తకాలు, సిలబస్ను కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్ర మే పాటిస్తుం టాయి. వీటికి అదనంగా సిలబస్ను రూపొందిం చుకుని ప్రైవేటు పబ్లిషర్ల వద్ద ముద్రించుకుని వాటిని అనుసరిస్తుండడం గతేడాది వరకు జరిగింది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పాఠ్యపుస్తకాలను ముద్రించ డం లేదా విక్రయించడంపై నిషేధం విధిస్తూనే, కచ్చితంగా ప్రైవేటు పాఠశాలలు సైతం ప్రభుత్వంనుంచే పుస్తకాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. ఆ మేరకు మార్కెట్లో కొద్దోగొప్పోవున్న పాఠ్యపుస్తకాలను ప్రైవేటు దుకాణాల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. తొలుత ఇండెం ట్ ఇచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో కొన్నింటికి కొన్ని తరగతుల పుస్తకాలు సరఫరా అయినప్పటికీ, ఆ తర్వాత జిల్లావిద్యాశాఖ ఒత్తిళ్ళమేరకు ఇండెంట్పెట్టి డిమాండ్ డ్రాఫ్ట్లను తీసి పంపినా ఇంతవరకు పుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదు.
ఇంకెన్నాళ్లు ?
ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు యాజమాన్యంలో 205 ప్రాథమిక, 394 ప్రాథమికోన్నత, 404 ఉన్నతపాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,86,840 మంది బాలబాలికలు చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలతోపాటు, మూడు వర్క్బుక్లు (సెమ్1,2,3) ఉంటాయి. ఇప్పటికి సెమ్–1 మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇవి కూడా పలు ప్రైవేటు పాఠశాలలకు ఇంతవరకు చేరనేలేదు. ఇక 6,7 తరగతుల విషయానికొస్తే లాంగ్వేజెస్ సబ్జెక్టుల పుస్తకాల్లో ప్రస్తుతం సెమ్–1 మాత్రమే సరఫరా చేశారు. ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన సిలబస్ ప్రకారం ఇప్పటివరకు సెమిస్టర్ వారీగా టెక్స్ట్బుక్స్ను సరఫరా చేసినట్టు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది పూర్తిగా కొత్త సిలబస్తో కూడిన పాఠ్యపుస్తకాలను 8వ తరగతిలో ప్రవేశపెట్టారు. ఈ తరగతి పుస్తకాలను ఇప్పటికీ పంపిణీ చేయడంలో తీవ్రజాప్యం ఎదురవుతుండగా, సంబంధిత తరగతి విద్యార్థులను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 16,379 మంది ఉన్నారు. ఇక 9,10 తరగతుల పాఠ్యపుస్తకాలను మాత్రం పంపిణీ చేయగలిగారు.
ప్రస్తుతం బోధన ఎలా అంటే ?
పాఠ్యపుస్తకాలకు డబ్బులు వసూలు చేసినా ఇంతవరకు విద్యార్థులకు ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను నిలదీస్తున్నారు. కొందరి వద్ద వున్న టెక్స్ ్టబుక్స్తో మిగతా విద్యార్థులకు బోధించడంతో పాటు నోట్ పుస్తకాలు ఇచ్చి సరిపెడుతున్నట్టు యాజమాన్యాలు వాపోతున్నాయి. అందుబాటులో వున్న పుస్తకాలను ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు మార్చుకుంటూ చదువుకోవాల్సిన దుస్థితి. పుస్తకాలకు అవసరమైన ఇండెంట్తోపాటే డీడీలను తీసి విద్యాశాఖకు అందజేసి నెలలు గడుస్తున్నా ఎప్పటికి పంపిణీ అవుతాయో విద్యాధికారులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక ప్రాథమిక తరగతులైన ఒకటో నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఇక అందే అవకాశాలు లేవని అంచనాకు వచ్చిన యాజమాన్యాలు ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్ కోసం ఎదురుచూడకుండా ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించే సిలబస్ను అనుసరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం పుస్తకాలు ఇచ్చినా వాటిని అటకెక్కించడమే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎనిమిదో తరగతిలో కొన్ని పాఠశాలలకు లాంగ్వేజి సబ్జెక్టులు పంపిణీ చేసినా ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, బయాలజీ సబ్జెక్టుల పుస్తకాలకు ఉమ్మడి జిల్లా అంతటా తీవ్ర కొరత నెలకొంది. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల కొరతపై జిల్లా విద్యాశాఖ వర్గాలను వివరణ కోరగా మేం అడిగినపుడే యాజమాన్యాలన్నీ ముందుగానే ఇండెంట్ పెట్టివుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ప్రాధాన్యతా క్రమంలో పాఠశాలలకు పంపిణీ చేస్తున్నాం. రెండు రోజుల్లోనే సమస్యపరిష్కారం అవుతుందని భావిస్తున్నాం’ అని వివరించాయి.