ఆధార్.. కొత్త మార్పు
ABN , First Publish Date - 2022-11-26T01:07:22+05:30 IST
జిల్లాల పునర్విభజన జరిగి నెలలు గడుస్తున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జిల్లా పేరు అందరి ఆధార్లోనూ నమోదు కావాల్సి ఉంది.
చిరునామాలో ఏలూరు జిల్లా పేరు
జిల్లాల పునర్విభజన జరిగి నెలలు గడుస్తున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జిల్లా పేరు అందరి ఆధార్లోనూ నమోదు కావాల్సి ఉంది. దీనికనుగుణంగానే ఇప్పటికే ఆధార్లో ఈ తరహా నమోదుకు ఎప్పుడు వీలవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. ఆ క్షణం రానేవచ్చింది. ఈ నెల 25వ తేదీ శుక్రవారం నుంచి కొత్త జిల్లాల నమోదుకు వీలుగా ఆన్లైన్లో అవకాశం కల్పిస్తూ తొలి అడుగు పడింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఆధార్లో ఇప్పటి వరకు ఏ సవరణ చేయాల్సి వచ్చినా తక్షణం ఆయా నిర్దేశిత కేంద్రాలకు జనం వెళ్ళేవారు. గంటల తరబడి వేచి ఉండి పని పూర్తి చేసుకు వచ్చేవారు. ఈ ఏడాది ఉగాది నాటికి జిల్లాల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పార్లమెంటు నియోజకవర్గాల భౌగోళిక స్వరూపమే ప్రాతిపదికగా కొత్త జిల్లాలు అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి మూడుగా విడిపోయింది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని భీమవరం కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పడింది. దీని పరిధిలోకి భీమవరం సహా తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలతో కలిపి పశ్చిమ గోదావరి జిల్లాగా కొత్త రూపురేఖలు వచ్చాయి. కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరుతో సహా ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమలో ఉన్న ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోల వరం, ఉంగుటూరుతో కలిపి కొత్తగా ఏలూరు జిల్లాగా ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికనుగుణంగానే ఎక్కడికక్కడ ఒక స్పష్టతతో కూడిన వివరాలన్నీ ప్రకటించింది. రాత పూర్వకంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తేదీ నుంచి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటిలోనూ జిల్లా పేరు మార్పు చేశారు. ఇదైతే జరిగింది కాని ఎవరంతట వారుగా వ్యక్తిగత రికార్డుల్లో మాత్రం ఏలూరు జిల్లాగా మార్పు చేసుకునేందుకు పెద్దగా పట్టు దొరకలేదు. అయితే ప్రభుత్వం ఇంతకు ముందే ఇచ్చిన గెజిట్ను అనుసరించి పోస్టల్ పిన్కోడ్ ప్రకారం శుక్రవారం నుంచి ఆధార్ అన్నిం టిలోనూ పశ్చిమ గోదావరికి బదులుగా ఏలూరు జిల్లా వర్తించేలా ఆన్లైన్లో సవరణ చేశారు. దీని ప్రకారం ఇవాల్టి నుంచి కొత్తగా నమోదు చేసే ఆధార్ అన్నింటి లోనూ ఏలూరు జిల్లా పరిధిలోని వారందరికీ కొత్త మార్పు స్పష్టంగా నమోదు చేస్తారు. తదనుగుణం గానే జరిగిన మార్పులు, చేర్పులను స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటిలోనూ పునర్విభజన అనంతరం స్పష్టతతో ఏలూరు జిల్లాగానే నమోదు చేస్తున్నారు. ఇప్పుడిక ఆధార్ వంతు రానేవచ్చింది.
ఏం చేస్తారంటే..
ఇప్పటికే ఆధార్ ప్రతీ ఒక్కరికి అత్యంత అవశ్యం. దీని నెంబర్ ఆధారంగానే అన్ని లావా దేవీలు ముడిపడి ఉన్నాయి. అలాగే ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ను సైతం అనుసంధాన ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతీ నెలా సచివాలయాలన్నింటిలోనూ ఆధార్లో మార్పులు, చేర్పులంటే తప్పుల సవరణ, పుట్టిన తేదీల మార్పులు, చేర్పులు వాటన్నింటినీ సవరిస్తూ వచ్చారు. అడ్రస్సును పూర్తిగా మార్చేటప్పుడు ఏలూరు జిల్లాగా నమోదు చేసేందుకు ప్రయత్నించినా ఆధార్లో ఈ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ అంగీకరించేది కాదు. ఇప్పుడు దీనికి భిన్నంగా ఆధార్ కార్డులోనూ స్పష్టతతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వారంతా ఆధార్లో తమ జిల్లా ఏలూరుగా నమోదు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఆధార్ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రక్రియ యావత్తు ఒకింత సరళతరం అయ్యేలా జాగ్రత్తలు పడుతూ వచ్చింది. ఇంతకుముందు ఆధార్లో మార్పులు, చేర్పులు, బ్యాంకు ఖాతాతో అనుసంధానం జరిగేటప్పుడు వందల మందితో ఆయా కేంద్రాలు నిండిపోయేవి. అనేక అవస్థలు పడేవారు. ఇప్పుడు వీటన్నింటికీ దాదాపు చెక్ పడింది. నేరుగా ప్రభుత్వం ముందుకు వచ్చి సచివాలయాల్లోనే ఆధార్ను కొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. ఆయా బాధ్యతలను ఎక్కడికక్కడ మండల అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో)కు అప్పగించింది.
ప్రతీ నెలా 25–27 మధ్యన ఈ ప్రక్రియ సాగేలా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఎలాగూ జిల్లా పేరు మార్పు సైతం ఈ మూడు రోజుల్లోనే అవసరమైన వారంతా నమోదు చేయించుకోవచ్చు. ఇప్పటికప్పుడు ఇదంతా అత్యవసరం కాదు కాబట్టి వీలైనప్పుడల్లా కొత్త జిల్లా పేరును సవరించుకోవచ్చు. అందువలన ఆయా ఆధార్ కేంద్రాలపై ఇప్పటికిప్పుడే పొలోమంటూ చేరి అవస్థలు పడే పరిస్థితి రాకూడదు.