10 ఆస్పత్రులు సిద్ధం
ABN , First Publish Date - 2022-01-22T06:30:32+05:30 IST
కొవిడ్ మూడో దశను సమర్థంగా ఎదుర్కోవడానికి కొవిడ్ ఆస్పత్రులను సిద్ధం చేశారు.
కొవిడ్ మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేలా చర్యలు..
అన్ని సచివాలయాల్లో కొవిడ్ పరీక్షలు
నోడల్ అధికారి డాక్టర్ బి.దుర్గామహేశ్వరరావు
తణుకు, జనవరి 21: కొవిడ్ మూడో దశను సమర్థంగా ఎదుర్కోవడానికి కొవిడ్ ఆస్పత్రులను సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి పది ఆస్పత్రులను ఎంపిక చేశారు. 724 పడకలను కేటాయించారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో 184 బెడ్స్ అందుబాటులో మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నాయి. అదే విధంగా కొవిడ్ పరీక్షలు, హోమ్ ఐసొలేషన్ కిట్లు, టీకాలు సమర్థంగా అమలు చేస్తున్నామని నోడల్ అధికారి డాక్టర్ బి.దుర్గామహేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
అందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నారా?
ఎవరికైనా లక్షణాలుంటే ఖచ్చితంగా టెస్టులు చేస్తున్నాం. పరీక్షలకు అవసరమైన అన్ని కిట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎక్కడెక్కడ పరీక్షలు చేస్తున్నారు?
పట్టణంలోని అన్ని సచివాలయాల్లో చేస్తున్నాం. వీటితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని రూమ్ నెం.22 లోను, ఎన్జీవో కాలనీలో పీహెచ్సీ, కొమ్మాయి చెర్వు గట్టు, బ్యాంకు కాలనీలోని లక్ష్మీ థియేటర్ వెనుక మీసేవా పైన గల సచివాలయంలో పరీక్షలు చేస్తున్నారు.
రోజూ పరీక్షలు చేస్తున్నారా?
ప్రతి రోజు అన్ని చోట్ల 100 నుంచి 150వరకు పరీక్షలు చేస్తున్నాం. టెస్టులకు ఎలాంటి నిబంధన లేదు. అవసరాన్ని బట్టి పెరుగుతాయి. కిట్లు అందుబాటులో ఉన్నాయి.
టీకాలు వేస్తున్నారా?
అన్ని చోట్ల టీకాలు వేస్తున్నాం. కొవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉంది. బూస్టర్ డోసుకు సంబంధించి ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వర్కర్సుకు వేస్తున్నాం. అలాగే రెండు డోసులు వేసి 9 నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసు వేస్తున్నాం.