రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2022-12-07T00:06:53+05:30 IST

రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై మంగళవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు.

రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై  విజిలెన్స్‌  దాడులు
విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం నిల్వలు

గరుగుబిల్లి, డిసెంబరు 6 : రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై మంగళవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. ఉల్లిభద్ర సమీపంలోని కోళ్ల ఫారంలో 89.5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో కార్డుదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి, ప్రధాన రహదారికి ఆనుకుని నిల్వ చేసినట్లు అందిన సమచారం మేరకు దాడులు జరిపామని విజిలెన్స్‌ సీఐ బి.సింహాచలం, పౌర సరఫరాల ఉప తహసీల్దార్‌ రమణారావు తెలిపారు. మొత్తంగా 177 బియ్యం బస్తాలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించామన్నారు. దీనిపై గరుగుబిల్లి ఎస్‌ఐ రాజేష్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. రేషన్‌ బియ్యం కొనుగోలు చేసిన వంగర మండలానికి చెందిన వండాన భాస్కరరావు, మోణంగి చంద్రమౌళి, పార్వతీపురానికి చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్నామని, వారిపై కేసు నమోదు చేయనున్నామని చెప్పారు.

Updated Date - 2022-12-07T00:06:55+05:30 IST