నేడు గురజాడ జయంతి
ABN , First Publish Date - 2022-09-21T05:36:15+05:30 IST
సమాజంలో వేళ్లూనుకున్న దురాచారాలను రూపుమాపేందుకు తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన మహాకవి గురజాడ అప్పారావు ఎప్పటికీ ఆదర్శనీయుడు. ఆయన రచనలు దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గడించాయి. ఇప్పటికీ ఈయన రచనల్లోని పదాల దిశానిర్దేశాల వాడి తగ్గలేదు.
విజయనగరం/ కలెక్టరేట్, సెప్టెంబరు 20: సమాజంలో వేళ్లూనుకున్న దురాచారాలను రూపుమాపేందుకు తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన మహాకవి గురజాడ అప్పారావు ఎప్పటికీ ఆదర్శనీయుడు. ఆయన రచనలు దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గడించాయి. ఇప్పటికీ ఈయన రచనల్లోని పదాల దిశానిర్దేశాల వాడి తగ్గలేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొద్దినెలల కిందట గురజాడను గుర్తు చేశారు. దేశ మంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టవోయ్ అంటూ కర్తవ్య బోధ చేశారు. ఇప్పటి సమాజానికీ గురజాడ రచనలు కర్తవ్యాన్ని తట్టి లేపుతున్న వైనాన్ని మనం గుర్తించవచ్చు. ఆ మహనీయుని జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 160వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే గురజాడ నివాసానికి రంగులు వేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. జయంతి వేడుకలకు ఏటా మంత్రులు హాజరై ఘన నివాళి అర్పిస్తున్నారు. ఈసారి కూడా వేడుకలకు కలెక్టర్ ఆధ్వర్యంలో సాంస్కృతికశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గురజాడ గృహం నుంచి ఎమ్ఆర్ కళాశాల వద్ద ఉన్న గురజాడ కూడలి వరకు బుధవారం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు.