సకాలంలో జీతాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-11-09T00:40:41+05:30 IST
ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల డిమాండ్
పార్వతీపురం రూరల్, నవంబరు 8 : ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లేట్లు చేతపట్టుకొని భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఉపాధ్యాయులు ఎదుర్కొలేదని యూటీఎఫ్ జిల్లా నాయకుడు ఎస్.మురళీమోహన్ తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించకపోగా, యాప్లతో ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. బైజూస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఫోన్ నెంబర్లను ఆన్లైన్లో నమోదు చేయలేదనే కారణంతో ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈవో ఎస్డీవీ రమణకు వినతిపత్రాన్ని అందించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని చెప్పారు. ఈ నిరసనలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.