ఐటీడీఏలో నిధుల్లేవ్
ABN , First Publish Date - 2022-11-10T00:28:54+05:30 IST
సీతంపేట ఐటీడీఏ ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది.
సీతంపేట: సీతంపేట ఐటీడీఏ ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది. నిధుల లేమి కారణంగా రోజువారి నిర్వహణ ఖర్చులు సమకూర్చుకోవడానికి కూడా సిబ్బందికి వెదుకులాట తప్పడం లేదు. మరోవైపు గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో సంబంధిత అధికారులకు కోర్టు నోటీసులు వచ్చి పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవంగా గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్దఎత్తున ఐటీడీఏకు నిధులు మంజూరయ్యేవి. వాటిని పీవో బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. వీటి ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ డబ్బులతో కార్యాలయ నిర్వహణ ఖర్చులు పెట్టుకునే వెసులుబాటు ఉండేది. ట్రైకార్, సీసీడీపీ, ఐఏపీ, జాతీయ ఉద్యానవనాలు, వ్యవసాయశాఖ వాటర్షెడ్, ఇంజనీరింగ్ వంటి శాఖల నుంచి నిధులు వచ్చేవి అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వాల నుంచి ఎటువంటి నిధులు సమకూరడం లేదు. మరోవైపు పథకాల నిధులు కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ కావడంతో ఐటీడీఏ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవంగా రాష్ట్రంలో ఏ ఐటీడీఏలో కూడా అమలు కాని విధంగా పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ రూపంలో చెల్లింపులు జరపడం, అవి కూడా పూర్తిస్థాయిలో రికవరీ అవక పోవడంతో అధికారులు సమాచాలోచనలు పడ్డారు.
ఇదీ పరిస్థితి..
వాహనాల నిర్వహణ కింద సీతంపేట పెట్రోల్ బంకు రూ.20 లక్షల మేరకు ఐటీడీఏ బకాయిలు ఉన్నాయి. గతంలో ఐటీడీఏ ఉద్యాన శాఖకు ఎరువులు పంపిణీ చేసిన మిత్ర, మల్లికార్జున ఏజెన్సీలు, వాటర్షెడ్ పథకం కింద రాతిగట్ల నిర్మాణానికి సంబంధించి కరీమ్ అనే వ్యక్తి బిల్లులు చెల్లించాలని ఇటీవల హైకోర్టును ఆశ్రయించి నోటీసులు పంపించారు. సీసీడీపీ పథకం కింద వరదగోడల నిర్మాణానికి రూ. 80 లక్షలు, వివిఽధ పథకాల కింద కోటి రూపాయల మేర ఐటీడీఏ చెల్లించాల్సి ఉంది. దీనిపై ఐటీడీఏ ఏపీవో రోసిరెడ్డిను వివరణ కోరగా బిల్లుల చెల్లింపు విషయమై కోర్టు నుంచి నోటీసులు రావడం వాస్తవమేనని తెలిపారు. నిధుల కొరత కారణంగా ఐటీడీఏ ఇబ్బందులు ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. బిల్లులు వచ్చిన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తామన్నారు.