‘ బుడా’ ప్లాట్ల విక్రయాలకు జీవో జారీ
ABN , First Publish Date - 2022-01-21T05:22:36+05:30 IST
బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బుడా) పరిధిలో మధ్యతరగతి వర్గాల కోసం నివాస స్థలాలు అమ్మేందుకు వీలుగా ప్రభుత్వం జీవో నెంబరు 76 ని జారీ చేసినట్లు బుడా ప్లానింగ్ అధికారి కె.పద్మజ తెలిపారు.
బొబ్బిలి రూరల్, జనవరి 20: బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బుడా) పరిధిలో మధ్యతరగతి వర్గాల కోసం నివాస స్థలాలు అమ్మేందుకు వీలుగా ప్రభుత్వం జీవో నెంబరు 76 ని జారీ చేసినట్లు బుడా ప్లానింగ్ అధికారి కె.పద్మజ తెలిపారు. గురువారం స్థానిక బుడా కార్యాలయంలో ఆమె మాట్లా డుతూ.. నియోజకవర్గానికి ఒక ప్రాజెక్టు చొప్పున అధునాతన లేఅవుట్ల కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. మూడు పట్టణాల్లో డిమాండ్ సర్వే పూర్తయిందన్నారు. దీని ప్రకారం బొబ్బిలిలో 2563 మంది, పార్వతీపురంలో 1127 మంది, సాలూరులో 1373 మంది ప్లాట్ల కొనుగోలుకు ముందుకొచ్చారన్నారు. బొబ్బిలికి సమీపంలోని గున్నతోటవలసలో సుమారు 50 ఎకరాలను గుర్తించా రన్నారు. రూ.18 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఈ ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 150, 200, 240 చదరపు గజాలుగా మూడు కేటగిరీల్లో స్థలాలను విభజిస్తారన్నారు. అధికారుల కమిటీ వీటి ధరలను నిర్ణయిస్తుం దన్నారు. 40, 60 అడుగుల రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అవెన్యూ ప్లాంటేషన్, నీరు , విద్యుత్ ఇతరత్రా అనేక అధునాతన సదుపాయాలను పబ్లిక్హెల్త్ శాఖ ద్వారా కల్పిస్తార న్నారు. దరఖాస్తులు అధికంగా వస్తే లాటరీ ద్వారా లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ లేఅవుట్లో పది శాతం స్థలాలను 20 శాతం రిబేట్తో విక్రయిస్తామన్నారు. స్థలం సొమ్మును లబ్ధిదారులు వాయిదాల్లో చెల్లించొచ్చని, ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని పొందొచ్చని స్పష్టం చేశారు. స్థలాల కోసం డిమాండ్ అధికంగా ఉంటే ఫేజ్-2, 3 లకు ప్రతిపాదనలుంటాయన్నారు. పూర్తిస్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయగానే దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాలకు బుడా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.