ఏజెన్సీలో ఐటీడీఏ పీవో పర్యటన

ABN , First Publish Date - 2022-12-03T00:42:17+05:30 IST

మండలంలోని ఏజెన్సీలో పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు.

ఏజెన్సీలో ఐటీడీఏ పీవో పర్యటన
ఎస్‌కే పాడు హెచ్‌ఎన్‌టీసీని పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 2 : మండలంలోని ఏజెన్సీలో పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఎల్విన్‌పేటలో శిథిలావస్థలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహ భవనాలను పరిశీలించారు. ఇక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని భద్రగిరి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యా బోధన ఏ విధంగా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఏ-2 పరీక్షలను పరిశీలించారు. నాడు-నేడులో భాగంగా నాబార్డు ఆర్టికల్‌ 270 నిధులతో అదనపు భవనాలు నిర్మిస్తున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి బయల్దేరిన పీవో భద్రగిరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. రోగులు పొందుతున్న సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. సవరకోటపాడు ఉద్యానవన కేంద్రానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హార్టీకల్చర్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పరిశీలనలో భద్రగిరి ఐటీడీఏ ఇంజినీరింగ్‌ డీఈ సింహాచలం తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-03T00:42:18+05:30 IST