రూ.91.9 లక్షలతో మౌలిక సదుపాయాలు
ABN , First Publish Date - 2022-07-26T05:03:06+05:30 IST
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.91.9 లక్షల నిధులకు పరిపాలనా పరమైన ఆమోదం లభించిందని, త్వరలోనే పనులు చేపడ్తామని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి ఎస్వీ రమణమూర్తి వెళ్లడించారు.
గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి రమణమూర్తి
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.91.9 లక్షల నిధులకు పరిపాలనా పరమైన ఆమోదం లభించిందని, త్వరలోనే పనులు చేపడ్తామని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి ఎస్వీ రమణమూర్తి వెళ్లడించారు. ‘ఇళ్లు.. సౌకర్యాలు నిల్లు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో సోమవారం వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు రానున్నాయన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదార్లకు అందించిన గుంకలాం లేఅవుట్లో రూ.81.9 లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నట్లు వెళ్లడించారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ లేఅవుట్లో ఇదివరకే గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టామని, భారీ వర్షాలకు తోడు ముడి సరకులను ట్రాక్టర్లు, లారీలు వంటి భారీ వాహనాలతో తరలిస్తున్న కారణంగా రోడ్లు పాడయ్యాయని అన్నారు. సమస్యను దృష్టిలో పెట్టుకుని పక్కా రోడ్ల నిర్మాణానికి నిధులను గృహ నిర్మాణ సంస్థ మంజూరు చేసిందన్నారు. వాతావరణం అనుకూలించిన తరువాత పనులు చేపడ్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఎస్.కోట మండలం పుణ్యగిరి లేఅవుట్ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరయ్యాయని, రోడ్లు.. ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులు ఖర్చుచేస్తామన్నారు.