ఈ-క్రాప్ పూర్తికావాలి
ABN , First Publish Date - 2022-10-05T05:22:31+05:30 IST
ఈ-క్రాప్ నమోదు, సాంకేతిక ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఈ క్రాప్ ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించేందుకు స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఆమె సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
నమోదు చేసిన వివరాలను సమగ్రంగా పరిశీలించండి
కలెక్టర్ సూర్యకుమారి
గంట్యాడ, అక్టోబరు 4: ఈ-క్రాప్ నమోదు, సాంకేతిక ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఈ క్రాప్ ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించేందుకు స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఆమె సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీఆర్వోలు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు ఈ-క్రాప్ వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ధ్రువీకరించాలని సూచించారు. ఈ-అథెంటికేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. ఖరీఫ్ ధాన్యం రైతుల చేతికి వచ్చేసరికి అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉండాలన్నారు. ప్రణాళికాయుతంగా అడుగులు వేయాలని చెప్పారు. ఈ-క్రాప్ ధ్రువీకరణ ప్రక్రియ తక్కువగా నమోదైన ఆయా మండలాల అధికారులతో కలెక్టరు స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రాప్లో నమోదైన వివరాల ధ్రువీకరణ అనంతరం సంబంధిత రైతుల నుంచి ఈకేవైసీ తీసుకునేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, వారికి రైతులు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ తారక రామారావు, తహసీల్దార్ ప్రసన్న రాఘవ, వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు
కష్టపడి పనిచేసి ఉద్యోగాలకు వన్నె తీసుకురావాలని కలెక్టర్ సూర్యకుమారి సూచించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వైద్యరోగ్య శాఖలో ఇటీవల చేపట్టిన జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఆఫీసు సబార్డినేట్స్, పోస్టుమార్టమ్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఎంపికైన 55 మంది అభ్యర్థులకు మంగళవారం కలెక్టరేట్లో నియామక పత్రాలను అందజేశారు. మిగిలిపోయిన 18 పోస్టులకు కూడా వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి రమణకుమారి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల తదితరులు పాల్గొన్నారు.