ఉత్సవ సందడి
ABN , First Publish Date - 2022-10-04T05:12:02+05:30 IST
జిల్లాకేంద్రం పార్వతీపురంలో దసరా సంబరాలు మిన్నంటాయి. సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు అందరిలోనూ జోష్ నింపాయి.
జిల్లాకేంద్రంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బెలగాం, అక్టోబరు 3 : జిల్లాకేంద్రం పార్వతీపురంలో దసరా సంబరాలు మిన్నంటాయి. సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు అందరిలోనూ జోష్ నింపాయి. జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కలెక్టర్ నిశాంత్కుమార్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చేపట్టిన జానపద కళారుపాలు, థింసా నృత్యం, తప్పెటగుళ్లు, కోలాటం ప్రదర్శన, టీవీ కళాకారుల బృందం కార్యక్రమాలు, డ్యాన్సులు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. శాస్త్రీయ నృత్యాలు, ఆంధ్రా, రాజస్థాన్, కేరళ, తదితర వస్త్రధారణ ఫ్యాషన్ షో, చిన్నారుల వినోద కార్యక్రమాలు అలరించాయి. నారాయణపురం చేనేత, పొందూరు ఖాదీ వస్త్ర ప్రదర్శనలు, ఐటీడీఏ పరిధిలోని వీడీవీకే, డ్వాక్రా ఉత్పత్తులు, విక్రయశాల, జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన, వెలుగు విభాగం ఏర్పాటు చేసిన చెక్క , వెదురు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో సవర ఆర్ట్స్ ప్రదర్శన , చిరుధాన్యాలు, గోగు నార, ఉత్పత్తులు, ఉద్యానవనశాఖ ఏర్పాటు చేసిన నర్సరీ తదితర స్టాల్స్ను పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే జోగారావు, ఎమ్మెల్సీ విక్రాంత్, సబ్ కలెక్టర్ భావ్న, డీఆర్వో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.