రేపటి నుంచి ముఖహాజరు
ABN , First Publish Date - 2022-12-31T00:31:44+05:30 IST
జిల్లాలో మండల పరిషత్ ఉద్యోగులందరూ జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ యాప్ ద్వారా హాజరు వేసుకోవాలని జడ్పీ సీఈవో అశోక్కుమార్ తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 30 : జిల్లాలో మండల పరిషత్ ఉద్యోగులందరూ జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ యాప్ ద్వారా హాజరు వేసుకోవాలని జడ్పీ సీఈవో అశోక్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మండల కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా కార్యాలయంలో ఉద్యోగుల హాజరు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగి ఎవరైనా సెలవుపై వెళితే తప్పనిసరిగా సెలవు చీటీని రాసి పెట్టాలన్నారు. లేకపోతే అటెండెన్స్ను నమోదు చేయాలని సూచించారు. కార్యాలయ రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేసి సక్రమంగా భద్రపర్చుకోవాలని సూచించారు. మరోసారి ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆ సమయానికి రికార్డులన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగలందరూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. జనవరి నుంచి తాను పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీవో జి.జగదీష్కుమార్, తదితరులు ఉన్నారు.
పది నిమిషాలు ఆలస్యమైతే సీఎల్
పార్వతీపురం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా 159జీవోను జారీ చేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి ముఖ హాజరు తప్పనిసరి అని అందులో పేర్కొంది. ఇదిలా ఉండగా పది నిమిషాలు ఆలస్యంగా విధులకు వెళ్తే సీఎల్గా పరిగణించనున్నారు. వరుసగా ఆలస్యంగా హాజరైతే ... ఆప్సెంట్గా మార్క్ చేసి జీతంలో కోత పెట్టనున్నారు. దీనిపై డీఈవో రమణను వివరణ కోరగా ఇంకా అటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.