రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-08-11T05:54:13+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి
- మరో విద్యార్థికి గాయాలు
నెల్లిమర్ల, ఆగస్టు 10: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఊటగెడ్డ మలుపు వద్ద బుధవారం వే కువ జామున జరిగిన రోడ్డు ప్రమా దంలో మిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి చల్లగాలి హృషీకేష్ జశ్వంత్ (21) మృతి చెందాడు. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థి రాము తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... విజయనగరంలో ఉంటున్న స్నేహితుల వద్దకు మంగళవారం రాత్రి హృషీకేష్ జశ్వంత్, రాము ద్విచక్ర వాహనంపై వెళ్లారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో నెల్లిమర్లలోని తమ రూమ్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఊటగెడ్డ మలువు వద్ద ఉన్న సరిహద్దు రాళ్లను బలంగా ఢీ కొనడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న కొందరు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో... వీరిద్దరిని సమీపంలో ఉన్న మిమ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జశ్వంత్ మృతి చెందాడు. రాము గాయాలతో బయటపడ్డాడు. మిమ్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లితండ్రులకు సమాచారం అందించారు. విజయనగరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి చేశారు. జశ్వంత్ మృతదేహానికి విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తల్లితండ్రులకు అప్పగించారు. కాగా జశ్వంత్ స్వస్థలం విజయవాడ అంబాపురం. జశ్వంత్ మృతదేహాన్ని చూసి తోటి విద్యార్థులు బోరున విలపించారు. కళాశాల యాజమాన్యం సంతాపం ప్రకటించింది.