బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.90వేలు మాయం

ABN , First Publish Date - 2022-09-10T05:36:15+05:30 IST

సైబర్‌ నేరగాళ్ల వలకు ఓ ఉపాధ్యాయిని చిక్కుకుంది. సుమారు 90 వేల రూపాయలు నష్టపోయి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిం ది.

బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.90వేలు మాయం

  సైబర్‌ వలలో మోసపోయిన ఉపాధ్యాయిని

కొత్తవలస: సైబర్‌ నేరగాళ్ల వలకు ఓ ఉపాధ్యాయిని చిక్కుకుంది. సుమారు 90 వేల రూపాయలు నష్టపోయి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. ఈ ఘటన కొత్తవలస మండలం చిన్నిపాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నిపాలెం గ్రామానికి చెందినఅంగన్‌వాడీ కార్యకర్త వంటాకు శోభారాణికి గురువారం విజయనగరం కలెక్టరేట్‌ నుంచి మాట్లాడుతున్నాం అంటూ ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది.  మీ గ్రామంలో కరోనాతో ఎవరైనా మృతి చెందారా? అని అడగడడంతో ఒక వ్యక్తి చనిపోయాడని ఆమె సమాధానం ఇచ్చింది. ఆ చనిపోయినవ్యక్తి కుటుంబానికి 52 వేలు పంపిస్తామని, ఫోన్‌పే నెంబరు చెప్పమనగా తనకు ఫోన్‌పే లేదని ఆ కార్యకర్త తెలిపింది. దీంతో ఫోన్‌పే ఉన్నవారి నెంబరు చెప్పాలని ఫోన్‌లో వ్యక్తి సూచిం చడంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని శ్రావణి వద్దకు వెళ్లి విషయం చెప్పింది. ఫోన్‌ చేసినవ్యక్తితో ఉపాధ్యాయిని మాట్లాడి, వాళ్ల సూచన మేరకు ఫోన్‌పే ఓపెన్‌ చేసి లాగిన్‌ అయ్యింది. అంతే అనంతరం మూడు విడతల్లో 89 వేల 995 రూపాయలు అకౌంట్‌ నుంచి విత్‌డ్రా అయ్యాయి. దీంతో తాము మోసపోయామని గ్రహించి స్థానిక పోలీసు స్టేషన్‌కు అంగన్‌వాడీ కార్యకర్త, ఉపాఽధ్యాయిని వెళ్లి ఫిర్యాదు చేయడంతో సీఐ బాల సూర్యారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-10T05:36:15+05:30 IST