నర్సీపట్నంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2022-12-31T01:41:06+05:30 IST
నియోజవర్గంలో ప్రభుత్వ భూమి చాలా ఉందని, నిరుద్యోగుల కోసం పరిశ్రమలు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు.
నర్సీపట్నం, డిసెంబరు 30: నియోజవర్గంలో ప్రభుత్వ భూమి చాలా ఉందని, నిరుద్యోగుల కోసం పరిశ్రమలు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు. శుక్రవారం జోనాథునిపాలెంలో సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రూ. వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీ లో ఇంటి పన్నులు 25 శాతం తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర వైద్య సేవలకు విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేదని, రూ.500 కోట్లతో మెడికల్ కళాశాలను అందుబాటులోకి తెస్తున్నారని తెలిపారు. అన్రాక్ నిర్వాసితులకు రెండు సెంట్లు భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆరిలోవ రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు త్వరితగతిన ఇప్పించాలని కోరారు. ఇప్పటివరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 66 గ్రామాలలో చేపట్టామని, ఈ సందర్భంగా టీడీపీకి చెందిన మహిళలను కలిసినప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్న జగనన్నకు ఓటేసి గెలిపించుకుంటామని చెప్పారని ఎమ్మెల్యే గణేశ్ అన్నారు.