గీతం స్మార్ట్ ఐడియాథాన్-2022 విజేత ఫీట్వింగ్స్
ABN , First Publish Date - 2022-08-13T06:11:31+05:30 IST
జాతీయ స్థాయిలో నూతన ఆలోచనలను ప్రోత్సహించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ), స్మార్ట్ ఆఫ్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఐడియాథాన్-2022 పోటీల ఫైనల్స్లో బిహార్లోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీకి చెందిన ఫీట్ వింగ్స్ జట్టు విజేతగా నిలిచింది.
రూ.2 లక్షల బహుమతి అందుకున్న బిహార్ ఆవిష్కర్తలు
విశాఖపట్నం, ఆగస్టు 12 : జాతీయ స్థాయిలో నూతన ఆలోచనలను ప్రోత్సహించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ), స్మార్ట్ ఆఫ్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఐడియాథాన్-2022 పోటీల ఫైనల్స్లో బిహార్లోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీకి చెందిన ఫీట్ వింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని అందుకుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తుల కాళ్లలో అల్సర్లు నివారించడానికి ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ద్వారా పరిష్కారం చూపుతూ ఫీట్వింగ్స్ స్టార్టప్ను నెలకొల్పిన అనిమేష్కుమార్, హృతిక్ జైస్వాల్లకు నిర్వాహకులు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బహుమతి మొత్తాన్ని అందజేశారు. బధిరుల కోసం మద్రాస్ క్రిస్టియన్ కళాశాల విద్యార్థులు కార్తీక్ జ్యోతి, మోతీష్ రూపొందించిన ‘అలిట్రిజ్’ అనే పరికరం తయారీ సంస్థ ద్వితీయ స్థానంలో నిలిచి లక్ష రూపాయలు బహుమతిని అందుకుంది.
తమిళనాడులోని శరణాధన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు అమృతలక్ష్మి, కరోలిన్ మేరీ రూపొందించిన వీల్చైర్ ఆలోచనకు ఉత్తమ మహిళా ఎంటర్ప్రెన్యూర్ అవార్డు లభించగా, తమిళనాడుకే చెందిన రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రవీణ్కుమార్, నబీల్ రూపొందించిన డెక్స్ర్టోవేర్ అనే ఆరోగ్య పరికరానికి స్వర్గీయ లెబెన్ జాన్స్న్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు లభించింది.
ఐఐటి గౌహతి విద్యార్థులు కె.పృధ్వీ, హరిహంత్సింఘ్ దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన ‘బ్రెయిలీ ప్రింటర్’కు ఉత్తమ బిజినెస్ ఐడియా అవార్డు అందజేశారు. విజేతలను గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ అభినందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అమెరికాకు చెందిన నార్త్ ఈస్ట్రర్న్ యూనివర్సిటీ అంతర్జాతీయ డైరెక్టర్ ప్రొఫెసర్ గ్రెగ్ కొలియర్, సెంటర్ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రవి రామమూర్తి, స్టార్టప్ ఇండియా మేనేజర్ డాక్టర్ సురభిగుప్తా, స్టోన్ సోష్ సహ వ్యవస్థాపకురాలు మాలినీ పరమార్, తదితరులు పాల్గొన్నారు.