తహసీల్దార్ మృతికి జిల్లా యంత్రాంగం సంతాపం
ABN , First Publish Date - 2022-12-10T01:26:19+05:30 IST
పెదబయ లు తహసీల్దార్ ఒ.శ్రీనివాసరావు మృతికి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులు సంతాపం తెలిపారు.
పాడేరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పెదబయ లు తహసీల్దార్ ఒ.శ్రీనివాసరావు మృతికి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులు సంతాపం తెలిపారు. తహ సీల్దార్ శ్రీనివాసరావు తన కార్యాలయంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మృతికి సంతాపంగా జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ ఆధ్వర్యంలో ఐటీడీఏలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, డీఆర్వో బి.దయానిధి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మృతదేహం విజయనగరం తరలింపు
స్థానిక జిల్లా ఆస్పత్రిలో తహసీల్దార్ శ్రీనివాసరావు మృతదేహానికి శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. శవ పంచనామా, పోస్టుమార్టం అనం తరం పెదబయలు ఎస్ఐ మనోజ్కుమార్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. దీంతో శ్రీనివాసరావు మృతదేహన్ని ప్రత్యేక వాహనంలో విజయనగరం తరలించారు. మృతుడి కుటుంబాన్ని గురువారం రాత్రి కలెక్టర్ సుమిత్కుమార్ జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.