అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-16T06:27:21+05:30 IST
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
తుమ్మపాల, మే 15: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఆదివారం మార్టూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఇళ్లల్లో మహిళలకు కరపత్రాలను అందించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూర, గత మూడేళ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల తీరు తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన చిట్ట చివరి వ్యక్తికి సైతం ప్రభుత్వ పథకాలు చేరవేయడమే ముందున్న ధ్యేయమన్నారు. అలాగే గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయనున్నట్టు ఆయన చెప్పారు.
అనంతరం సచివాలయాన్ని సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. మార్టూరు సచివాలయ పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల జాబితాలను ఉద్యోగులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సాంకేతికపరమైన సమస్యలతో పథకాలు అందని వారిని గుర్తించి తక్షణమే పరిష్కరించి పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సచివాలయ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని పలువురు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, సర్పంచ్ కరణం రెవెన్యూనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మిద్దె రాజాచంద్రరావు, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్కుమార్, ఎంపీడీవో సత్యశ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డీఈ వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.