ఏయూతో టాలెంట్ ఎడ్జ్ సంస్థ ఎంవోయూ
ABN , First Publish Date - 2022-05-19T05:18:14+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయంతో టాలెంట్ ఎడ్జ్ ఎడ్యుకేషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
ఆన్లైన్ కోర్సులకు సహకారం
ఏయూ క్యాంపస్, మే 18: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో టాలెంట్ ఎడ్జ్ ఎడ్యుకేషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ఏయూలో విభిన్న ఆన్లైన్ కోర్సుల నిర్వహణకు ఉపయుక్తంగా ఈ ఎంవోయూ చేసుకున్నారు. ఏయూ రెక్టార్ సమత సమక్షంలో వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా రెక్టార్ మాట్లాడుతూ ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం, ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో మరింత మందికి విద్యను చేరువ చేయడానికి ఇది ఉపకరిస్తుందన్నారు.
రిజిస్ట్రార్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం బీఏ, ఎంఏ కోర్సులను అందిస్తున్నామని, భవిష్యత్లో అత్యంత ఆదరణ కలిగిన మరిన్ని కోర్సులను ఆన్లైన్ విధానంలో ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దూరవిద్య కేంద్రం డైరెక్టర్ విశ్వేశ్వరరావు, అకడమిక్ డీన్ కిషోర్బాబు, ఆచార్య రమసుధ, టాలెంట్ ఎడ్జ్ సంస్థ ప్రతినిధి మహేష్ తదితరులు పాల్గొన్నారు. టాలెంట్ ఎడ్జ్ సంస్థ నిర్వాహకులు ఆన్లైన్ విధానంలో కార్యక్రమం వీక్షించారు.