శరవేగంగా హైవే నిర్మాణ పనులు
ABN , First Publish Date - 2022-12-30T00:53:04+05:30 IST
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు చేపడుతున్న జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లాలోని ఐ.పోలవరం నుంచి కొయ్యూరు మండలంలోని కాకరపాడు, అక్కడ నుంచి లంబసింగి వరకు విస్తరణ పనులు ఊపందుకున్నాయి. ఇదంతా మొదటి ప్యాకేజీ కిందకు వస్తుంది. దీని నిమిత్తం రూ.568.12 కోట్లు కేటాయించారు. ఈ పనులను ఎస్ఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపడుతోంది.
- ఐ.పోలవరం నుంచి లంబసింగి వరకు మొదటి ప్యాకేజీ కింద రూ.568.12 కోట్లు కేటాయింపు
కొయ్యూరు, డిసెంబరు 29: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు చేపడుతున్న జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లాలోని ఐ.పోలవరం నుంచి కొయ్యూరు మండలంలోని కాకరపాడు, అక్కడ నుంచి లంబసింగి వరకు విస్తరణ పనులు ఊపందుకున్నాయి. ఇదంతా మొదటి ప్యాకేజీ కిందకు వస్తుంది. దీని నిమిత్తం రూ.568.12 కోట్లు కేటాయించారు. ఈ పనులను ఎస్ఆర్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపడుతోంది. ఐ.పోలవరం నుంచి కాకరపాడు 113 కిలోమీటర్లు మేర రహదారి విస్తరణ, మధ్యలో వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు సాగుతున్నాయి. కాకరపాడు వరకు నాలుగు మండలాల పరిధిలో 34 గ్రామాల మీదుగా ఈ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాకరపాడు నుంచి చాపరాతిపాలెం వరకు సుమారు 55 కిలోమీటర్ల మేర గ్రామాలు లేని ప్రాంతాల్లో విస్తరణ పనులు చేపడుతున్నారు. కాకరపాడు- కాట్రగెడ్డ, చాపరాతిపాలెం- పెంటపాడు, పెంటపాడు- లంబసింగిల మధ్య వంతెనలు నిర్మిస్తున్నారు. కాకరపాడు నుంచి రొంపుల ఘాట్ మధ్యలో 14 వంతెనలు నిర్మిస్తున్నారు. అయితే కాట్రగడ్డ నుంచి రొంపుల ఘాట్, చింతాలమ్మ ఘాట్ నుంచి కొయ్యూరు మండలంలోని చింతలపూడి వరకు పనులు చేపట్టేందుకు అటవీ శాఖ అనుమతుల కోసం వేచి ఉన్నారు. మొదటి ప్యాకేజీ పనులు రెండేళ్లలో పూర్తి కావలసి ఉంది. దీనికి అనుగుణంగా పనులు చేపడుతున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తయితే మన్యం వాసులకు రవాణా కష్టాలు తీరినట్టే.