684 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2022-06-11T06:45:57+05:30 IST
మండలంలోని లబ్బూరు జంక్షన్ సమీపంలో పోలీసులు 684 కిలోల గంజాయి పట్టుకున్నారు.
తొమ్మిది మంది అరెస్టు
ఏడుగురు పరారీ
ముంచంగిపుట్టు, జూన్ 10: మండలంలోని లబ్బూరు జంక్షన్ సమీపంలో పోలీసులు 684 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేయగా, మరో ఏడుగురు పరారయ్యారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ ఆర్.సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు..
మండలంలో కెందుగూడ, లబ్బూరు మీదుగా జోలాపుట్టు వైపు గంజాయి రవాణా అవుతున్నట్టు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ సంతోష్కుమార్, పోలీసు సిబ్బంది లబ్బూరు సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో కెందుగూడ వైపు నుంచి వస్తున్న బొలోరా పికప్ వ్యాన్ని ఆపి సోదాలు చేశారు. బస్తాల్లో ప్యాకింగ్ చేసిన 684 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనానికి పైలట్గా ఉపయోగించిన ఒక జీపు, ఐదు ద్విచక్ర వాహనాలను గుర్తించి పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న జోలాపుట్టు పంచాయతీ బోండ్రుగూడ గ్రామానికి చెందిన నారాజి అద్దూ, లక్ష్మీపురం పంచాయతీ సంగంవలసకు చెందిన వంతాల మొదునో, అల్లంగి రమేష్, వంతాల నీలంబరం, కోడాపుట్టుకు చెందిన కిల్లో చెందర్, సుత్తిగూడకు చెందిన పంపా కాశీనాథ్, బిర్రుగూడకు చెందిన వంతాల సుబ్బారావు, ఒడిశాలోని కోరాపుట్టు జిల్లా అబొరడకు చెందిన గణేశ్వర్ బారిక్, కుంబరిపుట్టుకు చెందిన గెన్నూ కుంబార్ను అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారయ్యారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించామని, వాహనాలను సీజ్ చేశామని ఎస్ఐ చెప్పారు.