మాడుగుల సంతలో పైనాపిల్ ధరలు పతనం
ABN , First Publish Date - 2022-07-05T06:55:52+05:30 IST
మాడుగుల సంతకు సోమవారం అధికంగా పైనాపిల్, పనస పండ్లు వచ్చాయి. సంతలో ఎటుచూసినా ఇవే కనిపించాయి. దీంతో వాటి ధరలు పడిపోయాయి.
పండు సైజుని బట్టి రూ.6-10 వరకు కొనుగోళ్లు
మాడుగుల, జూలై 4: మాడుగుల సంతకు సోమవారం అధికంగా పైనాపిల్, పనస పండ్లు వచ్చాయి. సంతలో ఎటుచూసినా ఇవే కనిపించాయి. దీంతో వాటి ధరలు పడిపోయాయి. అల్లూరి జిల్లా దేవాపురం, సలుగు, కందులమామిడి, ఈదులపాలెం, పులుసుమామిడి ప్రాంతాల నుంచి గిరిజనులు పైనాపిల్ను మాడుగుల సంతకు తీసుకువచ్చారు. గతవారం ఒక్కో పైనాపిల్ పండు రూ.20లకు అమ్ముడుపోగా, ఈవారం సైజుని బట్టి రూ.6 నుంచి రూ.పదికి విక్రయించారు. సంత ముగిసే సమయానికి నాలుగు రూపాయలకే విక్రయించారు. అదేవిధంగా పనసపండు రూ.30 నుంచి రూ.50లకు విక్రయించారు. ఇదిలావుండగా ఆశీల వేలం పాటదారులు అధిక మొత్తంలో వసూలు చేయడంపై గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.