పరాయి పంచన డిగ్రీ కాలేజీ
ABN , First Publish Date - 2022-08-13T05:56:01+05:30 IST
మండల కేంద్రమైన నక్కపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఇంతవరకు సొంత గూటికి నోచుకోలేదు. కనీసం స్థలం కూడా మంజూరు చేయలేదు.
మూడేళ్ల నుంచి సొంతగూటికి నోచుకోని వైనం
ఇంతవరకు స్థలం కూడా కేటాయించని దుస్థితి
జూనియర్ కళాశాలలో తరగతుల నిర్వహణ
పలు సబ్జెక్టులకు మంజూరుకాని అధ్యాపక పోస్టులు
అరకొరగా విద్యా బోధన
నక్కపల్లి, ఆగస్టు 12: మండల కేంద్రమైన నక్కపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఇంతవరకు సొంత గూటికి నోచుకోలేదు. కనీసం స్థలం కూడా మంజూరు చేయలేదు. మూడేళ్ల నుంచి పరాయి పంచన (స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో) తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఒకేసారి తరగతులు నిర్వహించడానికి వసతి చాలకపోవడంతో షిఫ్ట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అధ్యాపక పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడంతో బోధన అరకొరగానే సాగుతున్నది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లికి డిగ్రీ కాలేజీని మంజూరు చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (బీజడ్సీ), బీఏ, బీకాం కోర్సులను ప్రారంభించారు. కానీ భవన నిర్మాణాలు చేపట్టకపోవడంతో సొంత భవనాలు నిర్మించే వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఉదయం జూనియర్ కళాశాల తరగతులు నిర్వహించి, మధ్యాహ్నం 1-15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు. 2021-22లో రెండో సంవత్సరం, 2022-23లో మూడో సంవత్సరం తరగతులు ప్రారంభించారు. అయితే అధ్యాపకులను పూర్తిస్థాయిలో నియమించలేదు. ప్రస్తుతం మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్ సబ్జెక్టులకు మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు వున్నారు. మిగిలిన సబ్జెక్టులకు ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి రెండు రోజులకోసారి లెక్చరర్లు వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. దీంతో అరకొరగా బోధన సాగుతున్నదని విద్యార్థులు వాపోతున్నారు. ఇదిలావుండగా డిగ్రీ కాలేజీకి సొంత భవనాలు నిర్మించడానికి ఇంతవరకు భూమిని కూడా కేటాయించలేదు.