ఏయూ ఉద్యోగులకు అందని జీతాలు
ABN , First Publish Date - 2022-10-11T06:38:20+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది జీతాల కోసం, రిటైర్డు ఉద్యోగులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు.
రిటైర్డు ఉద్యోగులకు పింఛన్లు కూడా రాలేదు
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడం వల్లే సమస్య
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది జీతాల కోసం, రిటైర్డు ఉద్యోగులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. పదో తేదీ వచ్చినా జీతాలు/పింఛన్లు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాలు/పింఛన్లు తీసుకోకుండానే దసరా పండగను చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. జీతాలను సకాలంలో చెల్లించకపోవడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి అని ఉద్యోగులు చెబుతుంటే, పింఛన్ల చెల్లింపుల్లో ప్రతినెలా జాప్యం జరుగుతోందని రిటైర్డ్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఒకటి, రెండు తేదీల్లో జీతాలు, పింఛన్లు రాకపోవడంతో ఈఎంఐలు, ఇంటి అద్దె వంటివి చెల్లించడం కష్టమవుతోందన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లకు ప్రతినెలా రూ.30 కోట్లు అవసరం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే, అందుకు అనుగుణంగా యూనివర్సిటీ అధికారులు బిల్లులను సీఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేస్తారు. అయితే, ప్రభుత్వం ఈ నెలకు సంబంధించిన జీతాలు, పింఛన్ల చెల్లింపునకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు చెల్లింపులు జరగలేదు. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు సుమారు 1500 మంది ఉండగా...వీరి జీతాలకు రూ.14 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులు 3,500 మందికి పింఛన్లు కోసం రూ.16 కోట్లు ప్రతి నెలా అవసరమవుతాయి. అయితే బడ్జెట్ విడుదల కాకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమైనట్టు చెబుతున్నారు.