నీరు-చెట్టు బిల్లులు చెల్లింపులో మీనమేషాలు
ABN , First Publish Date - 2022-10-08T06:37:24+05:30 IST
నీరు-చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు విషయంలో కోర్టు తీర్పులను అధికారులు పట్టించుకోవడం లేదు.
కోర్టు ఆదేశాలు బేఖాతరు
కోర్టు ధిక్కారం కింద మళ్లీ కేసులు వేస్తున్న నీటి సంఘాల మాజీ సభ్యులు
ఉమ్మడి జిల్లాలో రూ.44.5 కోట్లతో 715 పనులు
బిల్లులో కోత లేకుండా వడ్డీతో కలిపి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశం
అయినా పనుల్లో లోపాల పేరుతో అధికారులు కోత
(విశాఖపట్నం/అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
నీరు-చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు విషయంలో కోర్టు తీర్పులను అధికారులు పట్టించుకోవడం లేదు. న్యాయస్థానంలో ఒకలా చెబుతూ...తరువాత మరోలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీర్పును అమలు చేయడం లేదంటూ ఆయా పనులు చేపట్టిన నీటి సంఘాల మాజీ సభ్యులు, చైర్మన్లు కోర్టు ధిక్కార పిటిషన్లు వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు నీరు-చెట్టు పథకం కింద జల వనరుల శాఖ పరిధిలో చెరువులు, గెడ్డల్లో పూడికతీత, గట్లు పటిష్ఠం, చిన్నపాటి సిమెంట్ పనులు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ పథకం కింద 2017 నుంచి 2018 వరకు 715 పనులు జరిగాయి. వీటిని నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులు, డైరెక్టర్లు, సభ్యులు చేపట్టారు. ఇందుకోసం రూ.44.5 కోట్లు వెచ్చించారు. పూర్తిచేసిన పనులను అప్పట్లో క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేసి, ఎం.బుక్లో నమోదుచేసిన అనంతరం బిల్లుల క్లియరెన్స్ కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బిల్లులు మంజూరుకాలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు నీరు-చెట్టు పనుల బిల్లులను పెండింగ్లో పెట్టారు. దీంతో ఆయా పనులు చేసిన నీటి సంఘాల ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపునకు కొంత గడువు కోరిన ప్రభుత్వం, నీరు-చెట్టు పనుల తనిఖీలకు జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. జల వనరుల శాఖ కాకుండా ఇతర ఇంజనీరింగ్ శాఖల అధికారులతో తనిఖీలు చేయించాలని స్పష్టంచేసింది. జిల్లాలో నీరు-చెట్టు కింద చేసినపనుల తనిఖీకి గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల ఇంజనీర్లతో పది బృందాలను నియమించారు. ఈ బృందాలు మండలాల వారీగా పనులను తనిఖీ చేయడానికి గత డిసెంబరులో శ్రీకారం చుట్టాయి. అయితే డిసెంబరు తొలి వారం వరకు వర్షాలు కురవడంతో అనేక చెరువుల్లో మార్చి నెలలో కూడా నిండుగా నీరు ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ఆగస్టు వరకు ఉమ్మడి జిల్లాలో 300 పనులను తనిఖీ చేసిన ఇంజనీరింగ్ బృందాలు మిగిలినచోట్ల నీరు వుందని పేర్కొంటూ తరువాత పరిశీలిస్తామని నివేదికలు ఇచ్చారు. తనిఖీ చేసిన 300 పనుల్లో 10 నుంచి 15 పనులు మాత్రమే నాణ్యత లేవంటూ రిమార్క్ రాశారు. మిగిలిన పనులు సక్రమంగా వున్నాయని పేర్కొన్నారు. కానీ ఈ పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఇదిలావుండగా కోనాం ప్రాజెక్టు కింద చేపట్టిన ఎనిమిది పనులకు రూ.30 లక్షలు చెల్లించాలని కోరుతూ అక్కడ ప్రాజెక్టు సంఘం ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు పిటిషన్ను పరిశీలించి, బిల్లుల సొమ్ములో ఎటువంటి కోత విధించకుండా ఎం.బుక్లో నమోదైన రోజు నుంచి వడ్డీతో కలిపి తక్షణమే చెల్లించాలని నాలుగు నెలల క్రితం ఆదేశాలు ఇచ్చారు. తరువాత ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడంతో బిల్లులు చెల్లించాలని పే అండ్ అకౌంట్స్ విభాగానికి జల వనరుల శాఖ సిఫారసు చేయగా, పనుల్లో లోపాలు వున్న మేరకు కోతలు విధిస్తామని అక్కడ అధికారులు చెప్పారు. చివరకు విసిగిపోయిన కాంట్రాక్టర్లు కోతకు అంగీకరించగా, రూ.30 లక్షలకుగాను ఇప్పటివరకు రూ.1.2 లక్షలు మాత్రమే అధికారులు చెల్లించారు.
ఉమ్మడి జిల్లాలో మరో మండలానికి సంబంధించి నీరు చెట్టు కింద చేపట్టిన 17 పనులకు సంబంధించి రూ.1.3 కోట్లు బిల్లులు ఇవ్వాలని నీటి సంఘం ప్రతినిధులు కోర్టుకు వెళ్లగా... వెంటనే బిల్లులు ఇవ్వాలని రెండు నెలల క్రితమే తీర్పు వచ్చింది. అయినా అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో వీరంతా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అధికారులు మెట్టు దిగారు. రూ.1.3 కోట్ల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే పనులు చేపట్టిన వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కావడానికి మరికొన్ని నెలలు పడుతుందని అంటున్నారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినప్పటికీ, బిల్లుల్లో కోత వేయాలని పే అండ్ అకౌంట్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించిందని కోనాం ప్రాజెక్టు మాజీ చైర్మన్ గండి ముసలినాయుడు ఆరోపించారు. కోర్టు నుంచి అనుమతి తీసుకువచ్చినా ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు
నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు బిల్లుల మంజూరులో జల వనరుల శాఖ ఇంజనీర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించినప్పుడు జల వనరులశాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీరు నుంచి కిందిస్థాయి ఇంజనీరు వరకు హాజరవుతున్నారు. వ్యక్తిగత హాజరు సమయంలో బిల్లులు చెల్లించాలని కోర్టు చెబుతున్నదని, కానీ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని పలువురు ఇంజనీర్లు వాపోతున్నారు. దీనివల్ల కోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.