అయ్యన్న కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్
ABN , First Publish Date - 2022-02-24T21:27:33+05:30 IST
నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించారు.
విశాఖ జిల్లా: నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం విశాఖలోని కోర్టు పనులు ముగించుకుని నర్సీపట్నం వచ్చిన లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అయ్యన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో కలిసి భోజనం చేశారు.
కాగా అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. సీఎం జగన్ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో 505(2), 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయ్యన్నపాత్రుడి ఇంటికి వచ్చిన నల్లజర్ల పోలీసులు నోటీసులంటించారు. బుధవారం రాత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల చర్యలపై అయ్యన్నపాత్రుడి తరపు న్యాయవాది సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యన్నపై నమోదైన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.