పేదలకు చేరువగా వైద్య సేవలు
ABN , First Publish Date - 2022-09-13T06:00:59+05:30 IST
నిరుపేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగమే యూపీహెచ్ సీల ఏర్పాటు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
విశాఖపట్నం, సెప్టెంబరు 12: నిరుపేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగమే యూపీహెచ్ సీల ఏర్పాటు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ జోన్-2 పరిధి పీఎం పాలెం అవంతి కల్యాణ మండపం ఆవరణలో కొమ్మాది, అమరావతినగర్, మారి కవలస రాజీవ్ గృహకల్ప కాలనీల్లో నిర్మించిన యూపీహెచ్సీ భవనాలను ఆమె ప్రారంభించారు. అలాగే, ఏడో వార్డు స్వతంత్రనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన యూపీహెచ్సీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 977 పీహెచ్సీ లను రూ.407 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, రూ.253 కోట్లతో 145 కొత్త పీహెచ్సీలను ఏర్పాటు చేస్తున్నా మని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 184 యూపీహెచ్సీ లను ఆధునీకరిస్తుండగా, రూ.348 కోట్లతో 348 కొత్త యూపీహెచ్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 8 యూపీహెచ్సీలు నిర్మిస్తే అందులో నాలుగు మధురవాడ ప్రాంతంలోనే ఏర్పాటుచేసి నట్లు తెలిపారు.
అర్హులైన పేదలందరికీ సొంతిల్లు
అర్హులైన పేదలందరికీ సొంతిల్లు సమకూర్చాలన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. సోమవారం ఆనందపురం మండలం తంగుడుబిల్లి గ్రామం లో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ ఆర్హతే ప్రామాణికంగా పార్టీల కతీతంగా ఇళ్ల కేటా యింపు జరుగుతుందని చెప్పారు. ఆనంద పురం మండలంలోని దాదాపు 20 వేల మందికి పట్టాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తి లేదన్నారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి మాట్లాడుతూ రెండేళ్లలో ఇంటి నిర్మాణం జరుపుకొంటే ఒక్కో లబ్ధిదారునికి రూ.10 లక్షల ఆస్తి సొంతమవుతుందన్నారు.