31న స్టీల్ప్లాంట్లో కార్మిక సమ్మె
ABN , First Publish Date - 2022-01-27T06:48:08+05:30 IST
స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు నూతన వేతనాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నదని ఉక్కు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ అన్నారు.
ఉక్కుటౌన్షిప్, జనవరి 26: స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు నూతన వేతనాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నదని ఉక్కు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ అన్నారు. ఉక్కు ఉద్యోగులకు నూతన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న చేపట్టనున్న కార్మిక సమ్మె పోస్టర్ను బుధవారం ప్లాంట్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా సెయిల్లో చెల్లించిన విధంగానే విశాఖ స్టీల్ప్లాంట్లో కూడా చెల్లింపులు జరిగేవని, కానీ నేడు వాటిని యాజమాన్యం విస్మరించిందని ఆరోపించారు. ఇంటక్ ఉప ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ సంస్థ నష్టాల పేరుతో వేతన సవరణను కాలయాపన చేయటం తగదన్నారు. వేతనాల పెంపును కంపెనీ ఆర్థిక పరిస్థతులతో ముడిపెట్టవద్దన్నారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు కేఎస్ఎన్ రావు మాట్లాడుతూ కార్మికులను ఇబ్బందులు పెట్టే చర్యలు తీసుకోవద్దని, సంస్థ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జి.గణపతిరెడ్డి వై.మస్తానప్ప, బీఎంకే నాయక్, ఉగ్రం, బి.అప్పారావు, నాయుడు, వి.ప్రసాద్ పాల్గొన్నారు.