ఇటొస్తే ఇరుక్కుపోవాల్సిందే..
ABN , First Publish Date - 2022-08-14T06:00:58+05:30 IST
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లబ్బూరు నుంచి లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది.
అధ్వానంగా లక్ష్మీపురం ప్రధాన రహదారి
ఇటీవల కురుస్తున్న వర్షాలకు బురదమయం
రాకపోకలకు తీవ్ర అంతరాయం
మూడు పంచాయతీలతో పాటు ఒడిశాలోని 27 గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు
ముంచంగిపుట్టు, ఆగస్టు 13: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లబ్బూరు నుంచి లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలోని పేట్పుల్లెడి ఘాట్ మరీ దారుణంగా ఉంది. సుమారు అర కిలోమీటరు మేర రహదారి రూపురేఖలు మారిపోయాయి. ఈ రహదారి గుండా బరడ, బుంగా పుట్టు, లక్ష్మీపురం పంచాయతీలతో పాటు ఒడిశాలోని 27 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఆంధ్రా- బడిశా సరిహద్దులో ఉన్న ఈ రహదారి ఐదేళ్ల క్రితమే దెబ్బతిన్నది. దీని నిర్వహణను అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో మూడు పంచాయతీల ప్రజలతో పాటు ఒడిశా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి బురదమయంగా ఉండడంతో వాహనాలు కూరుకుపోతున్నాయి. తేలికపాటి వర్షం కురిసినా ఇటుగా రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపడతామని లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాథ్తో పాటు గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.