60,000 మంది ఔట్!
ABN , First Publish Date - 2022-04-22T06:47:22+05:30 IST
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఇళ్ల పట్టాలకు అర్హులైన వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత
మొదట 1,83,250 మంది అర్హులుగా గుర్తింపు
సచివాలయాలకు జాబితాలు
ఆఖరి నిమిషంలో మళ్లీ రీసర్వే
అనర్హులు అంటూ పేర్లు తొలగింపు
1,23,252 మందితో తుది జాబితా
నియోజకవర్గాల వారీగా ఖరారు
రెండు, మూడు రోజుల్లో లాటరీ నిర్వహణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఇళ్ల పట్టాలకు అర్హులైన వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఎనిమిది నియోజక వర్గాల్లో 1,23,252 మందిని అర్హులుగా తేల్చారు. మొదట రూపొందించిన జాబితాలో పేర్లు కలిగిన 60,000 మందిని ఇప్పుడు అనర్హులుగా పేర్కొంటూ పక్కనపెట్టారు. తుది జాబితాలో పేర్లు కలిగిన వారికి నగర పరిసర మండలాల్లో సిద్ధం చేసిన 72 లేఅవుట్లలో సెంటు చొప్పున స్థలం కేటాయించనున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో లాటరీ నిర్వహించబోతున్నారు.
జీవీఎంసీ పరిధిలో ఇళ్ల పట్టాలకు అందిన దరఖాస్తులు ఆధారంగా పలుమార్లు అధికారులు సర్వే చేసి 1,83,250 మందిని అర్హులుగా తేల్చారు. ఈ మేరకు లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించేందుకు వీలుగా పట్టాలను తయారుచేసి జోనల్ కార్యాలయాలకు పంపించారు. అక్కడి యూసీడీ సిబ్బంది, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలిసి లబ్ధిదారులకు ఫోన్ చేసి ఒక ఫొటో, ఆధార్ కార్డు వివరాలను సేకరించారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు అర్హులుగా తేలినవారిని మరోసారి వడకట్టాలని ఆదేశించడంతో పట్టాల పంపిణీకి బ్రేక్ పడింది. ఈ మేరకు వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల సభ్యుల వివరాలు (స్వగ్రామం ఏది?, అక్కడ వారి పేరుతో ఏమైనా ఇంటి పన్ను కడుతున్నారా?, అక్కడ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందా?, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా?...) సేకరించి 1,23,252 మందిని మాత్రమే అర్హులుగా నిర్ధారించారు. సుమారు 60 వేల మంది పేర్లను జాబితాల నుంచి తొలగించారు. కుటుంబంలో ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నవారు ఉన్నా, నాలుగు చక్రాల వాహనం కలిగివున్నా, వృత్తిరీత్యానో, వ్యాపార రీత్యానో పొరపాటున లబ్ధిదారుడి పేరుతో టీడీఎస్ (ఆదాయ పన్ను) రశీదు కనిపిస్తే...వారిని జాబితా నుంచి తొలగించారు.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే...అత్యధికంగా తూర్పు నియోజకవర్గంలో 21,708 మంది వుండగా, అత్యల్పంగా అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో 5,282 మంది అర్హులుగా తేలారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో 18,104 మంది, దక్షిణ నియోజకవర్గం పరిధిలో 14,190, ఉత్తర నియోజకవర్గం పరిధిలో 20,453, పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 13,257, గాజువాక నియోజకవర్గం పరిధిలో 21,271, పెందుర్తి నియోజకవర్గ పరిధిలో 8,987 మందిని అర్హులుగా గుర్తించారు. వీరందరికీ రెండు, మూడు రోజుల్లో ఆన్లైన్లో లాటరీ నిర్వహించి ప్లాట్లను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. లాటరీలో కేటాయింపు ఆధారంగా పట్టాలు తయారుచేసి ఈనెల 28న సీఎం చేతులు మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
తొమ్మిది మండలాల్లో 72 లేఅవుట్లు అభివృద్ధి
జీవీఎంసీ పరిధిలో ఇళ్ల పట్టాలకు అర్హులైన వారందరికీ సెంటు చొప్పున స్థలం అందజేసేందుకు భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, గాజువాక, పెదగంట్యాడ, అనకాపల్లి మండలాల్లో సుమారు ఆరు వేల ఎకరాలను సమీకరించారు. వీఎంఆర్డీ అధికారులు తొమ్మిది మండలాల్లో 72 లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 266 బ్లాక్లుగా విభజించి, సెంటు చొప్పున దాదాపు 1.48 లక్షల మందికి సరిపోయేలా స్థలాలను సిద్ధం చేశారు.
నియోజకవర్గం లబ్ధిదారుల సంఖ్య
భీమునిపట్నం 18,104
విశాఖ తూర్పు 21,708
దక్షిణం 14,190
ఉత్తరం 20,453
పశ్చిమ 13,257
గాజువాక 21,271
పెందుర్తి 8,987
అనకాపల్లి 5,282