గో బ్యాక్ మోదీ
ABN , First Publish Date - 2022-07-05T07:10:02+05:30 IST
విశాఖ హక్కు-ఆంధ్రుల హక్కు అని, కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించింది.
ఉక్కు కార్మికుల నిరసన
స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్
నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి జాతీయ రహదారిపై ఆందోళన
గంటపాటు స్తంభించిన ట్రాఫిక్
కూర్మన్నపాలెం (విశాఖపట్నం), జూలై 7: విశాఖ హక్కు-ఆంధ్రుల హక్కు అని, కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భీమవరం వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే వుంచుతామని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్లో పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు నల్ల జెండాలు ధరించి ‘మోదీ హఠావో-దేశ్ బచావో’, ‘మోదీ గో బ్యాక్’...అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకోకు దిగారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో ఇటు ఆటోనగర్ నుంచి అటు అగనంపూడి వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్ నరసింగరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, పరసాల శ్రీనివాసరావు, కేఎస్ఎన్ రావు, ఎన్.రామారావు, జె.రామకృష్ణ, తదితరులను పోలీసులు బలవంతంగా లేవదీయబోయారు. తాము గంటపాటు రాస్తారోకో చేసేందుకు అనుమతి అడిగామని, అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు స్పష్టంచేశారు. ట్రాఫిక్ స్తంభించిపోయిందని, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున ఆందోళనను విరమించాలని పోలీసులు కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే వుంచుతామని ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ 508 రోజులుగా ఉక్కు కార్మికులు పోరాటాలు చేస్తున్నా పీఎం మోదీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కమిటీ మరో చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు మరిన్ని ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్.రామారావు, గంధం వెంకటరావు, జె.రామకృష్ణ, నీరుకొండ రామచంద్రరావు, పరంధామయ్య, విల్లా రామ్మోహన్కుమార్, తదితరులు పాల్గొన్నారు.