వైభవంగా అప్పన్న కల్యాణం
ABN , First Publish Date - 2022-01-26T06:03:44+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామి కల్యాణాన్ని మంగళవారం వైభవంగా జరిపారు.
సింహాచలం, జనవరి 25: సింహాద్రి అప్పన్న స్వామి కల్యాణాన్ని మంగళవారం వైభవంగా జరిపారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రభాత ఆరాధనలు నిర్వహించాక ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో ఆలయ కల్యాణ మండపంలో ఉంచారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి ఆగమశాస్త్రోక్త విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలు జరిపాక కంకణధారణ నుంచి తలంబ్రాల వరకు ఆయా ప్రక్రియలను నేత్రపర్వంగా నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళ నీరాజనాలిచ్చి పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు.