ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
ABN , First Publish Date - 2022-11-12T04:39:08+05:30 IST
దేశంలో ప్రస్తుతం మీడియారంగం, పాత్రికేయులు క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్నారని...
ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి
విజయవాడ(ధర్నాచౌక్), నవంబరు 11: దేశంలో ప్రస్తుతం మీడియారంగం, పాత్రికేయులు క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారికి రక్షణ కరువైందని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. పత్రికా స్వేచ్ఛకు మునుపెన్నడూ లేని ప్రమాదం ఎదురవుతోందని, పాలకులు పాత్రికేయుల గొంతు నొక్కుతున్నారని, తీవ్రమైన అభియోగాలు మోపి వారిని అరెస్టు చేసి జైళ్లపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులకు మేలు చేసే చర్యలు తీసుకుంటారని జగన్ ప్రభుత్వంపై తాము పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయన్నారు. ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, అధ్యక్షుడు ఐ.వీ.సుబ్బారావు ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్లు జారీ చేయాలని, డిసెంబరు 31 నాటికి గడువు ముగుస్తున్నందున కొత్త అక్రిడేషన్ల జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, కమిటీల్లో గతంలో మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలని యూనియన్ డిమాండ్ చేసింది.