అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధుల ధ్వజం
ABN , First Publish Date - 2022-09-08T06:28:26+05:30 IST
అధికారుల పని తీరుపై ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది.
వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
ముంచంగిపుట్టు, సెప్టెంబరు 7: అధికారుల పని తీరుపై ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. వివిధ శాఖలకు చెందిన అధికారుల తీరు అభ్యంతరకరంగా ఉంటుందని సభ్యులు నిలదీశారు. ముఖ్యంగా మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని, మొక్కుబడి గా విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ధ్వజమెత్తారు. అలాగే సభ్యుల ఆమోదం లేకుండా పలు అంశాలపై తీర్మానాలు చేయడంపైనా వారంతా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీపీ అరిసెల సీతమ్మ మాట్లాడుతూ, మండల స్థాయి అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, స్థానికంగా నివాసం ఏర్పరచుకోవాలని సూచించారు. మండలంలో జరిగే పనులపై ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో అధికారులు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో ఏవీవీ.కుమార్, వైఎస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంఈవో చెల్లయ్య, ఏవో మోహనరావు, జీసీసీ బీఎం మోహన్, వెలుగు ఏపీఎం దేవమంగ పాల్గొన్నారు.