అప్పన్న దర్శనానికి తరలివచ్చిన భక్త జనం
ABN , First Publish Date - 2022-05-22T05:10:54+05:30 IST
వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. సింహగిరి జనసంద్రమయ్యింది.
ఒక్క రోజు రూ.38.74 లక్షల ఆదాయం
సింహాచలం, మే 21: వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. సింహగిరి జనసంద్రమయ్యింది. ప్రధానంగా కేశఖండనశాల, గంగధార, అనంతరం స్వామి దర్శనం క్యూలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంది. కేశ ఖండన శాల వద్ద భక్తులు ఎక్కువ సేపు నిరీక్షించాల్సివచ్చింది. శనివారం అప్పన్నస్వామి ఖజానాకు సుమారు రూ.38.74 లక్షల ఆదాయం సమకూరింది.
ఇందులో స్వామివారి అతిశ్రీఘ్ర, శ్రీఘ్ర దర్శన టికెట్ల ద్వారా రూ.22.02 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.8.92 లక్షలు, తలనీలాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.2.7 లక్షలు, ఆర్జిత సేవల ద్వారా రూ.79,750లు, టోల్గేటు వాహనాల టికెట్ల ద్వారా రూ.71.175లు, అన్నప్రసాద విరాళాల ద్వారా రూ.37,088లు ఇతర ఆదాయాలతో కలిపి మొత్తం రూ.38,74,133ల ఆదాయం సమకూరింది. అధికారులు అవసరమైన సదుపాయాలు కల్పించారు.