సాగు భూములకు పట్టాలివ్వాలి
ABN , First Publish Date - 2022-10-12T04:42:28+05:30 IST
సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఆదివాసీ రైతు సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష శిబిరాన్ని గదబపాలెం గ్రామంలో మంగళవారం ప్రారంభించారు.
బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్
అంతవరకూ దీక్ష కొనసాగిస్తాం..ఎల్డీ1:
గదబపాలెం గిరిజనులు స్పష్టీకరణ
గొలుగొండ, అక్టోబరు 11: సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఆదివాసీ రైతు సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష శిబిరాన్ని గదబపాలెం గ్రామంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. కల్యాణ్ మాట్లాడుతూ.. పాతమల్లంపేట రెవెన్యూలో సర్వే నంబరు 850లో 36 ఎకరాల భూమిని పెదగదబపాలెంకు చెందిన 25 ఆదివాసీ కుటుంబీకులు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారన్నారు. గిరిజనులను సాగులో వున్న భూములు తమవని విశాఖపట్నానికి చెందిన వక్కలంక సుధాకర్ వేధిస్తున్నారన్నారు. తప్పుడు పత్రాలతో గిరిజనులు చేస్తున్న సాగు భూములను ఆన్లైన్ చేసేందుకు ఈ ఏడాది మార్చి నెలలో సర్వే నిర్వహించారన్నారు. సాగులో వున్న గిరిజనులకు కాకుండా విశాఖపట్నానికి చెందిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదిక అందజేశారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ బహిరంగ విచారణ చేపట్టాని డిమాండ్ చేశారు. అలాగే ఆయా ఆదివాసీల గ్రామాలను ఐదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఇక్కడకు వచ్చి విచారణ చేపట్టేవరకూ దీక్ష కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎం. రాజు, పాతమల్లంపేట సర్పంచ్ మామిడి ఆదిలక్ష్మి, గోరా సూరిబాబు, చెంచయ్య, సాగుదారులు పాల్గొన్నారు.