ప్రణాళికాబద్ధంగా చదివితే సివిల్స్ సాధ్యమే
ABN , First Publish Date - 2022-08-15T05:43:58+05:30 IST
ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో చదివితే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించడం సులభమేనని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు.
సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ
విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో చదివితే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించడం సులభమేనని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విజయ పథం యూపీఎస్సీ ఉచిత మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళితే విజయం సాధించవచ్చన్నారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాలనుకునే వారికి ఓర్పు, సహనం అవసరమన్నారు. ఎమోషన్కు గురి కాకుండా అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్నారు.
పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంగ్లీష్ దినపత్రికలు చదివి వర్తమాన అంశాలపై అవగాహనతోపాటు నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. కార్తికేయ ఐఏఎస్ అకాడమీ డైరక్టర్ పీఎన్ రాజు మాట్లాడుతూ యూపీఎస్సీ పేపర్లు అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమం బి.అభిమన్యు అధ్యక్షతన జరగ్గా, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు, కోశాధికారి వీఎస్ పద్మనాభరాజు పాల్గొన్నారు.