పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి
ABN , First Publish Date - 2022-11-29T00:04:05+05:30 IST
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా ఆదేశించారు.
డీఎంహెచ్వో డాక్టర్ జమాల్ బాషా
లంబసింగి, లోతుగెడ్డ పీహెచ్సీల ఆకస్మిక తనిఖీ
చింతపల్లి, నవంబరు 28: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా ఆదేశించారు. సోమవారం ఆయన లంబసింగి, లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఓపీ రిజిస్టర్, మందుల గది, అంబులెన్స్ లాగ్ బుక్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ పీహెచ్సీల్లో వైద్యాధికారి, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటూ సకాలంలో రోగులకు చికిత్స అందించాలన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో గిరిజన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యాధులు సోకినట్టు సమాచారం వస్తే వెంటనే ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందించడంతో పాటు గృహాలను సందర్శించాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలన్నారు. వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోతుగెడ్డ పీహెచ్సీ వైద్యాధికారి లక్ష్మీకాంత్, లంబసింగి వైద్యాధికారి మారమ్మ పాల్గొన్నారు.