‘ఇ-కర్షక్’లో పంటల నమోదుతో ప్రయోజనాలు
ABN , First Publish Date - 2022-07-30T06:34:46+05:30 IST
జిల్లాలోని రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను ఇ-కర్షక్ యాప్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి జీవీఎన్ లీలావతి సూచించారు.
జిల్లా వ్యవసాయాధికారిణి లీలావతి
ఎస్.రాయవరం, జూలై 29: జిల్లాలోని రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను ఇ-కర్షక్ యాప్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి జీవీఎన్ లీలావతి సూచించారు. మండలంలోని భీమవరంలో గల వ్యవసాయ క్షేత్రాలను, ఎస్.రాయవరంలోని రైతు భరోసా కేంద్రాలను శుక్రవారం ఆమె సందర్శించి మాట్లాడారు. పంటల నమోదు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగినప్పుడు, పంట రుణాలు కావాల్సినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆర్బీకే సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఇన్చార్జి ఏడీఏ ఉమాదేవి, ఏవో సౌజన్య, ఏఈవో దేముడు, వీహెచ్ఏ వరుణ్, వీఏఏ కుమార్ తదితరులు పాల్గొన్నారు.