స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం
ABN , First Publish Date - 2022-09-27T06:25:00+05:30 IST
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా వెనకాడబోమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె.రామకృష్ణ పేర్కొన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె.రామకృష్ణ
కూర్మన్నపాలెం, సెప్టెంబరు 26: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా వెనకాడబోమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జె.రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 592వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పోరాటాలతోనే ఉక్కు పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ‘ఉక్కు’ను కాపాడుకునేందుకు కార్మికులంతా గొంతెత్తి ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకైన ఉక్కు కర్మాగారం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం చేస్తున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నష్టాల్లో వున్నందునే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం తప్పుడు ప్రచారాలు చేయడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు.రామస్వామి, ఎన్.రామారావు, గంధం వెంకటరావు, గంగవరం గోపి, ప్రసాద్, కేఎస్ఎన్ రావు, మస్తానప్ప, పలువురు కార్మికులు పాల్గొన్నారు.