సదరం మెగా శిబిరానికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-11-03T00:38:15+05:30 IST

సబ్‌ డివిజన్‌ కేంద్రం చింతపల్లిలో ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించే సదరం మెగా శిబిరం ఏర్పాట్లను సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌తో కలిసి పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ పరిశీలించారు.

సదరం మెగా శిబిరానికి ఏర్పాట్లు
సదరం శిబిరం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

చింతపల్లిలో 4, 5 తేదీల్లో నిర్వహణ

శివారు గ్రామాల నుంచి ప్రత్యేక వాహన సదుపాయం

27 మంది ప్రత్యేక వైద్య నిపుణులతో తనిఖీలు

పాడేరు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

చింతపల్లి, నవంబరు 2: సబ్‌ డివిజన్‌ కేంద్రం చింతపల్లిలో ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించే సదరం మెగా శిబిరం ఏర్పాట్లను సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌తో కలిసి పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరం శిబిరాన్ని చింతపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరాన్ని పింఛన్‌ రాని దివ్యాంగులు వినియోగించుకోవాలని కోరారు. ఈ శిబిరంలో దివ్యాంగులను పరీక్షించి ధ్రువపత్రాలు జారీ చేసేందుకు 27 మంది ప్రత్యేక వైద్య నిపుణులు హాజరుకానున్నారన్నారు. తొలిరోజు చింతపల్లి మండలానికి చెందిన దివ్యాంగులు, రెండో రోజు చింతపల్లి, జీకేవీధి మండలాల దివ్యాంగులు హాజరుకావాలన్నారు. వివిధ విభాగాల వైద్యులకు ప్రత్యేక గదులు కేటాయిస్తున్నామని తెలిపారు. వైద్యులు పరీక్షలు నిర్వహించేందుకు అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌ సదుపాయంతో 15 కంప్యూటర్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ శిబిరానికి 500 మందికి పైగా దివ్యాంగులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. దివ్యాంగులు, సహాయకులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులను కుటుంబ సభ్యులు గ్రామాల నుంచి ప్రధాన రహదారి వరకు తీసుకు వస్తే అక్కడ నుంచి జీపులు, ఆటోల ద్వారా చింతపల్లి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దివ్యాంగులు గ్రామ వలంటీర్‌, సచివాలయం ఉద్యోగుల సహాయం తీసుకోవాలన్నారు. దివ్యాంగులను శిబిరానికి చేర్చే బాధ్యతలను గ్రామ వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులకు అప్పగించామన్నారు. దివ్యాంగులు ఆధార్‌ కార్డు, ఆధార్‌ నంబర్‌తో అనుసంఽదానం చేసిన ఫోన్‌, గతంలో తీసుకున్న సదరం ధ్రువపత్రాలను తీసుకు రావాలన్నారు. దివ్యాంగులుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛన్‌ రాని ప్రతి ఒక్కరూ ఈ శిబిరానికి హాజరుకావాలన్నారు. శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన మందులను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ సదరం శిబిరం విజయవంతానికి వివిధ శాఖల అధికారులు, సచివాలయం ఉద్యోగులతో ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకర్‌ ప్రసాద్‌, టీడబ్ల్యూ డీడీ కొండలరావు, డీఎల్‌పీవో పీఎస్‌ఎన్‌ కుమార్‌, ఎంపీడీవో రమేశ్‌, తహసీల్దార్‌ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌, ఈపీడీసీఎల్‌ ఏఈఈ వెంకట రమణ, సీఐ రమేశ్‌, ఈవోఆర్‌డీ శ్రీనివాసరావు, హెచ్‌ఎం రామరాజు పడాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T00:38:17+05:30 IST